పరాకాష్టకు వైసీపీ, టీడీపీ పోరు-బూతుల తూటాలు-పరస్పర వార్నింగ్స్-ఒక్క ఛాన్స్ చాలంటూ..
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. టీడీపీ నేత పట్టాభి బోసడికే వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం కాస్తా ఇప్పుడు తీవ్రమైంది. ఇరు పార్టీల నేతలు అంతకు మించిన బూతు వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. అలాగే పరస్పరం హెచ్చరికలు కూడా చేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఓ గంట అవకాశమిచ్చి చూడాలంటూ టీడీపీ నేతలు చంద్రబాబును కోరుతుండగా.. తాము దాడులు చేయాలనుకుంటే ఇలా ఉండదంటూ వైసీపీ నేతలు కౌంటర్లు సంధిస్తున్నారు.
పరాకాష్టకు వైసీపీ, టీడీపీ వార్
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ పరాకాష్టకు చేరుకుంది. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన ఈ వార్ ఇప్పుడు అంతకు మించి బూతు వ్యాఖ్యలతో రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇరు పార్టీల మధ్య పట్టాభి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓవైపు చంద్రబాబు దీక్ష, మరోవైపు వైసీపీ జనాగ్రహ దీక్షలు పోటా పోటీగా సాగుతున్నాయి. ఇందులో నేతల వ్యాఖ్యలు హద్దులు దాటిపోతున్నాయి. అదే సమయంలో వీరిని నియంత్రించేందుకు పార్టీల అధినేతలే కాదు సీనియర్లు కూడా ఏమాత్రం ప్రయత్నించడం లేదు.
బూతులతో రెచ్చిపోతున్న నేతలు
ఏపీలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ అన్న తేడా లేకుండా ఇరు పార్టీల నేతలు బూతులతో విరుచుకుపడుతున్నారు. పట్టాభి వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ నేతలు బూతులతో రెచ్చిపోతుండగా.. అటు టీడీపీ నేతలు కూడా బోసడికేని మించిన వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు. దీంతో వినేందుకు, రాసేందుకు సైతం వీల్లేని భాష ఏపీ ప్రజలు వినాల్సిన, చూడాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని ఈ బూతు పంచాంగాల శ్రవణంపై జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమను ఉద్ధరిస్తారని ఎన్నుకున్న నేతల అసలు రూపం చూసి జనం నివ్వెరపోతున్నారు.
పరస్పర హెచ్చరికలు
పట్టాభి వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర హెచ్చరికలకు దిగుతున్నారు. పట్టాభి వ్యాఖ్యల్ని సమర్ధిస్తూ వైసీపీ ని విమర్శిస్తూ టీడీపీ చెలరేగిపోతుండగా.. పట్టాభి వ్యాఖ్యల్ని విమర్శిస్తూ వైసీపీ దాడుల్ని సమర్ధిస్తూ ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇదే క్రమంలో పరస్పరం హెచ్చరికలు కూడా చేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే సత్తా చూపిస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తుండగా.. తాము చేయాలనుకుంటే పరిస్ధితి ఇలా ఉండదని వైసీపీ నేతలు ప్రత్యర్ధులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో అధికార, విపక్షాలతో సంబంధం లేకుండా వైసీపీ, టీడీపీ ఇస్తున్న వార్నింగ్స్ పై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Recommended Video
అందరికీ ఒకే మాట.. ఒక్క ఛాన్స్
ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న వార్ లో అందరి నోటా ఒకటే మాట వినిపిస్తోంది. అధినేతలు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలంటున్నారు నేతలు. అటు వైసీపీ, ఇటు టీడీపీ ఇరు పార్టీల నేతలు కూడా అధినేతలు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు తమ సత్తా చూపుతామని చెప్తున్నారు. అదీ అధినేతలు, సీనియర్ నేతల సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అధినేతల ఆశీస్సులతోనే నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతుండగా.. వైసీపీ నేతలు ఎలాగో అధికారంలో ఉన్నాం కాబట్టి కనుసైగ చేస్తే చాలని తమ అధినేత జగన్ ను కోరుతున్నారు.