కెసిఆర్ ముద్రకే: పొన్నాల, బేలతనం: జగన్ పార్టీ నేత
హైదరాబాద్: ఎంసెట్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి పొరపాటు చేసిందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తమ వ్యక్తిగత ముద్ర, ప్రాబల్యం కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్టకరమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి 70 రోజుల పాలనలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగానే కెసిఆర్ పాలన ఉందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ నిర్ణాయాల్లో బేలతనం కనిపిస్తోందని. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో స్పష్టత లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై టిడిపి ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆయన మండిపడ్డారు.
వ్యవసాయ బడ్జెట్లో రుణాల మాఫీ ఉందా, లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ బడ్జెట్ పేరుతో ప్రజలను ఊరించడానికి చేస్తున్న మరో ప్రయత్నం రుణమాఫీ అంశమని ఆయన అన్నారు. రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి అల్లాద్దీన్ అద్భుత దీపం ఏదైనా ఉందా అని నెహ్రూ అడిగారు.
నదీజజలాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఉత్పత్తి ఆశాజనకం అనుకోవచ్చునని, అయితే విద్యుత్ సేకరణ ఎలా చేస్తారో చెప్పకుండా నిరంతర విద్యుత్తు ఎలా ఇస్తారని ఆయన అన్నారు. వ్యవసాయ రుణాల రీషెడ్యూల్కు, రుణమాఫీకి సంబంధం లేదని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఏ విధమైన స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ఆయన అన్నారు.