వారేనేమో: పొన్నాల కౌంటర్, ఏపీ రాజధానిపై శివాజీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను ప్రత్యామ్నాయం కాదన్న వారే అలా కావడానికి ప్రయత్నిస్తున్నారేమోనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఎద్దేవా చేశారు. పొన్నాల పైన సొంత పార్టీ నేతలు పలువురు పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.
ఈ నెల 17వ తేదీన పీసీసీ కార్యదర్శుల సమీక్షా సమావేశం ఉంటుందని చెప్పారు. సీఎల్పీ నేత జానారెడ్డి సమావేశం గెట్ టుగెదర్ అని మాత్రమే తనకు తెలుసునని చెప్పారు. తన నైతిక స్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరన్నారు.

ఇది తీసుకుంటే, అదివ్వాలి: నాయిని
కేంద్రం సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిని తీసుకుంటే రాష్ట్రానికి నాచారం ఈఎస్ఐని ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలతో నాయిని మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్మికులకు కనీస వేతన చట్టాలను తీసుకు వస్తామని చెప్పారు. 45 రోజుల్లో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ఉంటుందన్నారు. నెల రోజుల్లో కార్మిక సంఘాల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోలపై చలానా భారం లేకుండా చూస్తామన్నారు.
రాజధాని అక్కడే: యలమంచిలి
ఏపీ రాజధానిని విజయవాడ - గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ మంగళవారం అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు అన్ని అక్కడ ఉన్నాయన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ప్రోత్సహించేందుకు రాజధాని నిర్మాణం అక్కడా ఇక్కడా అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications