చిరు నాకు అన్యాయం చేశారు లేదంటే సిఎంగా: పొన్నాల
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనకు అన్యాయం చేశారని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సరదాగా వ్యాఖ్యానించారు. శాసన మండలి వాయిదా పడిన సమయంలో పొన్నాల విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే తాను ముఖ్యమంత్రి అయ్యేవాడినని, ఆ పార్టీ 18 సీట్లలోనే విజయం సాధించడం ద్వారా చిరు తనకు అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు.
అప్పట్లో పిఆర్పీకి 60 నుండి 80 సీట్లు వస్తాయని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, అహ్మద్ పటేల్లు అంచనా వేశారని, ఇదే విషయాన్ని వైయస్ రాజశేఖర రెడ్డితో ప్రస్తావించారన్నారు.
పిఆర్పీతో సంకీర్ణం తప్పదేమోనని, సిఎంగా మిమ్మల్ని అంగీకరించకపోతే ఏం చేద్దామని ఢిల్లీ పెద్దలు వైయస్ను అడిగారని, అప్పుడు వైయస్ తన పేరును సూచించారని పొన్నాల అన్నారు.
పిఆర్పీ ప్రభావం చూపలేకపోవడంతో తనకు అవకాశం చేజారిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 2009లో లక్షల ఎకరాల పంట దెబ్బతినే పరిస్థితిలో వైయస్ చేతులెత్తేసినా తాను నిర్ణయం తీసుకొని కిన్నెరసాని నుంచి నీటిని అందించానని, అక్కడ మంచి దిగుబడి వచ్చిందని, ఈ నిర్ణయంతోనే అక్కడ నాటి చిరు పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగామన్నారు. లేకుంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి తాను సిఎంను అయ్యేవాడినన్నారు. ఆ ప్రాంతానికి నీటిని ఇచ్చి తన గొయ్యి తానే తవ్వుకున్నానని సరదాగా అన్నారు.