బాబుతో మాట్లాడు: కేసీఆర్కు పొన్నాల, గర్వంగా: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూర్చొని, మాట్లాడి విద్యుత్, నీటి కష్టాలు, సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం అన్నారు.
శ్రీశైలం జల విద్యుత్ విషయంలో కృష్ణా రివర్ బోర్డు తీర్పు ఏమాత్రం సరిగా లేదన్నారు. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో విద్యుత్ సమస్య మొదలైందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ వైఫల్యం లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు సామాన్యులకు అద్దం పట్టేలా ఉండాలన్నారు.
బుధవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందునే కేసీఆర్ హడావిడిగా ఛత్తీస్గఢ్కు వెళ్లి విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే బంగారు తెలంగాణ, బాధల తెలంగాణగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు. విద్యుత్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

చేతలకు, మాటలకు పొంతన లేదు: తమ్మినేని
తెరాస ప్రభుత్వం మాటలు, చేతలకు పొంతన లేదని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునేలా బడ్జెట్ ఉండాలన్నారు. ప్రజల కోసం తాము అసెంబ్లీ వేదికగా పోరాడుతామన్నారు.
బడ్జెట్ పైన ఈటెల
తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తమ తొలి బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం చెప్పారు. కేంద్రంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు.
అవసరాలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఆచరణాత్మక బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. మూడేళ్లలో విద్యుత్ రంగంలో స్వావలంబన ఉంటుందన్నారు. అవమానాలు, అసమానతల నుండి తెలంగాణ సాధించుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications