పేరు మార్చొద్దని మోడీకి పొన్నాల లేఖ: కెసిఆర్కూ..
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు శనివారం తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చవద్దని మోడీకి రాసిన లేఖలో పొన్నాల లక్ష్మయ్య కోరారు.
శంషాబాద్ విమానాశ్రయానికి ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలని నరేంద్ర మోడీకి పొన్నాల విజ్ఞప్తి చేశారు. ఆ పేరు మార్చి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పేరు పెట్టి ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దని లేఖలో పొన్నాల పేర్కొన్నారు. విమానాశ్రయం పేరు మార్చడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు.

హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖుల, ఉద్యమ నేతల విగ్రహాలు ఏర్పాటు చేయాలని పొన్నాల లక్ష్మయ్య.. కెసిఆర్కు రాసిన మరో లేఖలో పేర్కొన్నారు. కాళోజి నారాయణ రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ. జయశంకర్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, శ్రీకాంతాచారిలాంటి ఉద్యమకారులు, ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కెసిఆర్కు సూచించారు.
విగ్రహాలు ఏర్పాటులో ఎవైనా సమస్యలెదురైతే.. కాంగ్రెస్ పార్టీ తరపున విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం తమకు కల్పించాలని పొన్నాల ఆ లేఖలో కోరారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందన సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ దినోత్సవాలను పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుపుతామని షబ్బీర్ అలీ చెప్పారు.












Click it and Unblock the Notifications