టీ న్యూస్ మెడలు ఎవరు వంచాలి: కెసిఆర్పై పొన్నం
కరీంనగర్/ ఖమ్మం/ మెదక్: మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు తెలంగాణ నాయకుడు పొన్నం ప్రభాకర్ తప్పు పట్టారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీడియాను అణిచివేస్తానని అనడం సరికాదని ఆయన అన్నారు. ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం సమంజసమా అని ఆయన బుధవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
ప్రతిపక్షాల వార్తలను టీ న్యూస్లో ప్రసారం చేయడం లేదని ఆరోపించారు. టీ న్యూస్ మెడలు ఎవరు వంచాలని పొన్నం నిలదీశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 100 రోజుల పాలన శూన్యమని విమర్శించారు. పార్టీలోకి వలసలు, సింగపూర్ పర్యటన తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. విపక్షాలు విమర్శిస్తే ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.
మహిళా జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య అని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఏ తప్పు చేసిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై నిషేధం విధించారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్ 100 రోజుల పాలనలో తిరోగమనంలో అభివృద్ధి జరిగిందని కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు.
కెసిఆర్పై జానా రెడ్డి విమర్శలు
కాగా, మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కెసిఆర్పై ప్రతిపక్ష నేత కె. జానా రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కెసిఆర్ నెరవేర్చలేదని ఆయన విమర్సించారు. సెంటిమెంటును రెచ్చగొట్టి కెసిఆర్ అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. ఉద్యోగం అడిగిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయించడం ఏమిటని ఆయన అడిగారు. జానారెడ్డితో పాటు కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.