నాగార్జునా! జాగ్రత్త!!: పొన్నం, కెసిఆర్పై జెపి ఫైర్
కరీంనగర్/ హైదరాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలోని గుజరాత్ పాలనపై ప్రశంసలు చేసిన సినీ నటుడు నాగార్జునపై కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. గుజరాత్ పల్లెలు అందంగా ఉన్నాయని అంటున్న నాగార్జున బంజారాహిల్స్లోని ఫిల్మ్ నగర్ దాటి వచ్చి మన రాష్ట్ర పల్లెలు చూశారా అని ఆయన అడిగారు. నాగార్జునను నటుడిగా గౌరవిస్తామని, అయితే సినిమా రాజకీయాలు చేస్తే మాత్రం జాగ్రత్త అని ఆయన అన్నారు. హోటల్లో పుట్టిన పార్టీ అక్కడే మునిగిపోతుందని ఆయన కరీంనగర్లో మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై లోకసత్తా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ విరుచుకుపడ్డారు. కెసిఆర్ మాటలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తన కుటుంబ రాజకీయాల్లోకి వస్తారు, వస్తే తప్పేమిటని అన్న కెసిఆర్ మాటలపై ఆయన మండిపడ్డారు
రాజకీయాలంటే కుటుంబ పాలన కాదని జెపి అన్నారు. నాయకుల కొడుకులే నాయకులైతే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు, ఓట్లు ఎందుకని ఆయన అడిగారు. యువత అంటే నాయకుల కొడుకులు, కూతుళ్లు, మేనల్లుళ్లు మాత్రమే కాదని, ప్రతిభ ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువత ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వం పోవాలని ఆయన అన్నారు. రాజకీయ నేతలు వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన విమర్శించారు.
కెసిఆర్ ఆకాశం తెచ్చి చేతుల్లో పెడతానని వాగ్దానం చేస్తున్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఓట్ల కోసమే కెసిఆర్ అభివృద్ధి నినాదం ఎత్తుకున్నారని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ పార్లమెంట్లకు పదేళ్ల పాటు కెసిఆర్ ప్రాతినిధ్యం వహించారని, ఆ నియోజకవర్గాలకు ఏమీ చేయలేదని, ఇప్పుడు తెలంగాణకు ఏం చేస్తారని ఆయన అన్నారు