వైయస్ బతికుంటే ఒప్పుకునేవారు: కిరణ్పై పొన్నం ఫైర్
కరీంనగర్: వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండేవారని కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మాట తప్పి విశ్వాసఘాతకుడిగా మారారని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ రెడ్డి గురువారం అన్నారు.
ఆయన కరీంనగరగ్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పారని, ఇప్పుడు మాట తప్పారని పొన్నం దుయ్యబట్టారు. వైయస్ ఉంటే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండేవారని, నిర్ణయం తర్వాత వ్యతిరేకించే వారన్నారు.
మొదట అధిష్టానం చెప్పినట్లు వింటానని ఇప్పుడు విశ్వాస ఘాతకుడిగా కిరణ్ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమయంలో కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టకరమన్నారు. పదే పదే ఇందిరా గాంధీ మాటలను చెబుతున్న సిఎం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాటలను ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
విడిపోకుంటే చెడిపోతామని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రి బాలరాజు చెబితే, బలం ఉంది కదా అని ఆయనపై దౌర్జన్యం చేయడం ఏమాత్రం తగదన్నారు. తెలంగాణకు అసలు ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డేనని, ఆయన పార్టీ నుండి వెళ్లినా నష్టం లేదని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు నిజామాబాద్ జిల్లాలో అన్నారు.