పోసాని కృష్ణ మురళికి సీఎం జగన్ కీలక బాధ్యతలు..!!
ఎట్టకేలకు పోసాని కృష్ణ మురళికి సీఎం జగన్ పదవి కట్టబెట్టారు. చాలా కాలంగా సీఎం జగన్ కు పోసాని గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. జగన్ పాదయాత్ర సమయంలోనూ పాల్గొన్నారు. జగన్ అధికారంలోకి వస్తే పోసానికి పదవి దక్కుతుందనే ప్రచారం అప్పట్లోనే పెద్ద ఎత్తున జరిగింది. ఆయనకు ఏ పి ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇస్తారని భావించారు. కానీ, విజయ్ చందర్ కు ఆ బాధ్యతలు కేటాయించారు. తాజాగా సినీ నటుడు ఆలీకి సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు హోదాలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు బాధ్యతలు కేటాయించారు.
సీఎంను కుటుంబ సమేతంగా కలిసి ఆలీ తనకు పదవి ఇవ్వటం పైన సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. ఇదే సమయంలో ఏ పి ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో రాజకీయంగా అధికార వైసీపీ..పవన్ కళ్యాణ్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న పరిస్థితుల్లో పోసాని ఎంపిక కూడా ఆసక్తి కరంగా మారింది. జగన్ కు మద్దతుగా గతంలో పలుమార్లు పోసాని టీడీపీతో పాటుగా పలువురికి కౌంటర్లు ఇచ్చారు. పవన్ లక్ష్యంగానే ఆలీ - పోసాని ఎంపిక జరిగినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పోసానికి తొలి నుంచి సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు.
సినిమా టికెట్ల ధరల వ్యవహారంలో చిరంజీవితో పాటుగా పలువురు హీరోలు హజారైన సమావేశంలోనూ పోసానికి ఆహ్వానం దక్కింది. ఆ సమావేశంలో పోసానికి ఇచ్చిన ప్రాధాన్యత పైన అనేక రకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఇక, రానున్న ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో పోసానికి కీలకమైన సినీ రంగానికి సంబంధించిన బాధ్యతలు దక్కాయి. టాలీవుడ్ తో ఏపీ ప్రభుత్వం మధ్య సంబంధాల విషయంలో టికెట్ల ధరల వేళ తారా స్థాయికి చేరింది. ధరల పెంపుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఆ వివాదం సమిసిపోయింది. పోసాని 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. దీంతో, ఇప్పుడు పోసాని తన కొత్త బాధ్యతల్లో ఏ విధంగా సక్సెస్ అవుతారనేది చూడాలి.