నో డౌట్..కేసీఆర్ తిట్టింది చంద్రబాబునే.. అడుగు బయటపెడితే అంతే.. నిజంగా జగన్కు అంత సీనుందా?
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు.. జగన్-కేసీఆర్ జలపంచాయతీలో చివరికి చంద్రబాబు టార్గెట్ అయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కోసం తీసుకొచ్చిన ఏపీ సర్కారు తెచ్చిన జీవో 203పై ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే.. పొరుగురాష్ట్రంగా సంఖ్యత కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ సీఎం జగన్ తో కలిసుండటం చూడలేక ''కొంతమంది కళ్లు మండుతున్నాయా!?''అని కేసీఆర్ ప్రశ్నించింది ఇంకెవరినోకాదు.. చంద్రబాబునే అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
జగన్తో దోస్తీ.. పోతిరెడ్డిపాడు జల వివాదం... తన వైఖరేంటో కుండబద్దలు కొట్టిన కేసీఆర్..
థండర్ ప్రెస్మీట్..
తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులపై ప్రకటన చేసేందుకు మీడియా ముందుకొచ్చిన సీఎం కేసీఆర్.. పోతిరెడ్డిపాడుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘ఏపీతో ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. మాకేం వివాదాలు లేవు. ఇప్పటి వరకూ అన్యోన్యంగా కలిసి ఉన్నాం. కలిసే ఉంటాం. మేం కలిసుంటే కొంతమంది కళ్లు మండుతున్నాయా!? రాయలసీమకు గోదావరి నీళ్లు వెళ్లాలని నేనే అన్నాను.. స్పష్టమైన హామీ ఇస్తేతప్ప వృథా నీళ్ల కోసమే ప్రాజెక్టు అన్న ఏపీ వాదనను నమ్మబోము.. అయితే, ఈ విషయంలో కొందరు కిరికిరి పెట్టాలని చూస్తున్నారు..''అంటూ కేసీఆర్ ఫైరయ్యారు. ఆయన మాటలు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి..
అనుమానం లేదు.. అన్నది ఆయననే..
కళ్లుమండుతున్నాయా? అని తెలంగాణ సీఎం ఎవరిని ఉద్దేశించి అన్నారనే చర్చ చల్లారకముందే.. వైసీపీ తరఫున క్లారిటీ రావడం గమనార్హం. ‘‘కళ్లు మండుతున్నాయా'' అని కేసీఆర్ తిట్టింది చంద్రబాబునే అని విజయసాయి తెలిపారు. ‘‘ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్ ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని''అని ఎంపీ రాసుకొచ్చారు.
డా.సుధాకరేనా.. పోతిరెడ్డిపాడు వద్దా?
సగం ఏపీకి తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు గురించి నోరు తెరవని చంద్రబాబు.. సస్పెండైన డాక్టర్ సుధాకర్ తాగి రోడ్డుమీద చిందులేస్తే మాత్రం వరుసగా ట్వీట్లు పెడుతున్నారని విజయసాయి మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకుని పనిచేసే జీతగాళ్లను కూడా ఎగదోస్తున్నారని, వ్యక్తుల ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి చంద్రబాబుకు పట్టదని అన్నారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన చంద్రబాబు.. ఇవాళ పొరుగు రాష్ట్రంలో ప్రవాస జీవితం గడుపుతున్నారని, కనీసం పక్కింటి వాళ్లు కూడా గుర్తించలేని అజ్ఞాతవాసం గడుపుతున్నారని, ‘‘బయటకు అడుగుపెడితే క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియాకెక్కుతున్నాయి. ఎంత కష్టం వచ్చిపడింది!''అని ఎద్దేవా చేశారు.
కరోనా భయం..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రాష్ట్రానికి చెందిన బస్సుల్ని తెలంగాణలో అడుగుపెట్టనీయబోమని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే, వృద్ధులను బయటికి రానీయకుండా చూసుకోవాలన్న సూచన చేశారు. దీనిని చంద్రబాబుకు అన్వయిస్తూ విజయసాయి ఇలా రాసుకొచ్చారు.. ‘‘కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని కేసీఆర్ కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడ్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు''అని వ్యాఖ్యానించారు.
జగన్కు అంతుందా?
పోతిరెడ్డిపాడు ఇష్యూలో ఇద్దరు సీఎంలు.. చంద్రబాబును టార్గెట్ చేశారన్న సంగతి అర్థమైన వెంటనే టీడీపీ ఎదురుదాడికి దిగింది. ‘సీమద్రోహి జగన్' పేరుతో సంచలన ప్రకటన చేసింది. ప్రజాసమస్యలు, వైసీపీ దోపిడీల నుంచి జనం దృష్టిని మళ్ళించడానికే పోతిరెడ్డిపాడు అంశాన్ని తెరపైకి తెచ్చారని, పాత ప్రాజెక్టు కాలువల వెడల్పును కూడా కొత్తదిగా నమ్మిస్తూ హంగామా చేస్తున్నారని, ఏడాది కాలంగా పోలవరాన్ని పక్కన పెట్టేసిన సీఎంకు.. కృష్ణా నదిలో భారీ వరదలు వచ్చినా సీమ ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడం చేతకాని జగన్ కు కొత్త ప్రాజెక్టులు కట్టేంత సీన్ ఉందా? అని ప్రతిపక్షం ప్రశ్నించింది. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులతో తో రాయలసీమకు నష్టం అని తెలిసినా, జగన్ బుద్ధి లేకుండా ప్రారంభోత్సవాలకు వెళ్లాడని టీడీపీ మండిపడింది.
Recommended Video
పాకిస్తాన్ అన్నారుగా..
పోతిరెడ్డిపాడు విస్తరణ పేరుతో సీఎం జగన్ చేస్తున్నదంతా నాటకమని చంద్రబాబు మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ, భూముల కుంభకోణం, అడవుల నరికివేత, కరోనా వైరస్ కట్టడిలో వైఫల్యం.. ఇలా ప్రతి చోటా ఫెయిలవుతోన్న జగన్.. ప్రజల దృష్టి మళ్లించడానికే నీటి పంపకాల అంశాన్ని తెరపైకి తెచ్చరని సోమవారం జిల్లా నేతలతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో బాబు అన్నారు. ‘‘కాళేశ్వరం పూర్తయితే రెండు రాష్ట్రాలు ఇండియా-పాకిస్తాన్లా మారతాయని దీక్ష చేసిన జగన్.. అదే కాళేశ్వరం ఓపెనింగ్ కు వెళ్లి, కేసీఆర్ను పొగిడారు. ఇప్పుడు కూడా తెలంగాణ సీఎంతో కలిసి జగన్ కొత్త డ్రామాకు తెరలేపారు''అని బాబు మండిపడ్డారు.