బాబుకు జగన్ పార్టీ హెచ్చరిక, టీకి ఏపీ ఉద్యోగుల షాక్
హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఉప సర్పంచ్ కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి ఈ హత్యను ఖండించారు. టీడీపీ నేతలు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని హితవు పలికారు.
కాగా, గత రాత్రి ఇంట్లో ఉన్న కృష్ణారావును ప్రత్యర్థులు బయటకు లాక్కొచ్చి కర్రలతో దాడి చేసి కొట్టి చంపారు. పాత కక్షలు, గ్రామంలో ఇరు పార్టీల మధ్య ఆదిపత్య పోరే హత్యకు కారణమని చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కృష్ణారావు మృతదేహంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కంచికచర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కృష్ణారావును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలే పంపించారు
రుణమాఫీ అంశంలో ఆర్బీఐకి ఫ్యాక్స్ పంపించింది టీడీపీ నేతలేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సోమవారం ఆరోపించారు. విజయవాడ గవర్నర్పేటలోని టీడీపీ కార్యాలయం నుండే ఫ్యాక్స్లు పంపించారని విమర్శించారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళనతో ఉన్నారని, ఇది తెలిసిన టీడీపీ, రైతు వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో తెలియక కొత్త నాటకానికి తెరలేపారన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగుల ఝలక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సర్వే అధికారులుగా ఆంధ్ర ఉద్యోగులు పాల్గొనరని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబితేనే సర్వేలో పాల్గొంటామన్నారు. తమపై నమ్మకం లేనప్పుడు సర్వేలో పాల్గొనాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనాలంటూ ఇరవై రెండు మంది ఏపీ ఉద్యోగులకు జీహెచ్ఎంసీ కమిషనర్ నోటీసులు పంపిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు పైవిధంగా స్పందించారు.