విద్యుత్కు వెయ్యి, స్టీల్ ప్లాంట్కు 5 వేల కోట్లు
విశాఖపట్నం: హుదూద్ తుఫాన్ సృష్టించినా బీభత్సాన్ని ఒక్కొక్కటిగా లెక్కిస్తున్నారు. తొలుత హుదూద్ తుఫాన్ కారణంగా విద్యుత్ వ్యవస్దకు రూ. 1000 కోట్లు నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. 80 శాతం భాగం నష్టం వైజాగ్ నగరం వల్లనే సంభవించిందని తెలిపారు.
బుధవారం విశాఖపట్నంలో విలేకర్లు సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు రాత్రికి 50 నుంచి 70 వేల మందికి విద్యుత్ ఇవ్వనున్నట్లు చెప్పారు. వైజాగ్ నగరం మొత్తం పూర్తి స్దాయిలో కరెంట్ సరఫరా చేసేందుకు ఇంకా నాలుగు రోజుల సమయం పడుతుందని అన్నారు.
రేపు ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్టులకు కరెంట్ సరఫారా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్ర్రాల నుంచి ట్రాన్స్ ఫార్మర్లను తెప్పిస్తున్నామని... ఒక్క వైజాగ్ నగరంలోనే విద్యుత్ వ్యవస్దను పునరుద్దరించడానికి రెండు వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు.
గాజువాక సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ వ్యవస్దను ఇప్పటికే పునరుద్దరించామని తెలిపారు. ఈ రోజు సాయంత్రంలోగా నక్కలవారి పాలెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను పునరుద్దరించనున్నట్లు పేర్కొన్నారు. మందుస్తు చర్యల వల్ల ప్రాణనష్టం బాగా తగ్గించగలిగామని ఆయన వెల్లడించారు.
విశాఖ ఉక్కకు రూ. 5000 కోట్ల నష్టం
హుదూద్ తుఫాన్ ప్రభావం వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కూడా చూపింది. చరిత్రలో తొలిసారి 12 విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోవడమే కాకుండా అపార నష్టం వాటిల్లింది. ప్రాధమిక అంచనా ప్రకారం హుదూద్ తుఫాన్ వల్ల స్టీల్ ప్లాంట్కు రూ. 5వేల కోట్లు నష్టం వాటిలిన్నట్లు సమాచారం.
స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ఎంతో ముఖ్యమైన విద్యుత్ ప్లాంట్ షట్ డౌన్ కావడం తీవ్ర నష్టం కలిగించింది. దీంతో ప్లాంట్లో ఉత్పత్తి పునఃప్రారంభం కావాలంటే పూర్తిగా ట్రాన్స్ కో పై ఆధారపడాల్సిన పరిస్దితి ఏర్పడింది.
అంతేకాకుండా ప్లాంట్లోని కృష్ణా బ్లాస్ట్ ఫర్నీస్కు భారీ నష్టం వాటిల్లిన్నట్లు సమాచారం. దీనితో పాటు కోక్ ఓవెన్కు చెందిన నాలుగు బ్యాటరీల పరిస్దితి ఏ స్దితిలో ఉన్నాయన్న దానిపై ఉక్కు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్దరణ ఐతే గానీ ఏ విషయం చెప్పలేమని అంటున్నారు నిపుణులు.
విశాఖకు చెందిన రూఫ్ షీట్లు గాలికి కోట్టుకుపొవడంతో వాటి నిర్మాణానికి కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్దితి తలెత్తింది. స్టీల్ ప్లాంట్కు ప్రస్తుతం ట్రాన్స్ కో నుంచి విద్యుత్ సరఫరా అత్యంత కీలకంగా మారింది. ఈ విషయాలన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.