ఒంగోలు: ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎదురింటాయనకు భారీ షాక్ -పోలీసుల ఎంట్రీతో అనూహ్య ట్విస్ట్
ఇదేమీ అక్రమ సంబంధాల వ్యవహారం కాదు. అచ్చంగా దొంగతనమే. అయితే, తన ఇంట్లో దొంగలు పడ్డారంటూ ఓ కిలాడీ లేడీ సీన్ రక్తి కట్టించడం.. నిజంగా దొంగతనం జరిగింది ఎందురింట్లో కావడంతో.. అసలు దొంగను పట్టుకునేందుకు పోలీసులకు కష్టపడాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలోని బెస్తవారిపేటలో చోటుచేసుకున్న ఈ సంఘటన.. చివరికి అనూహ్య ట్విస్ట్ తో ముగిసింది..
తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్లో గంటకు రూ.3వేలంటూ
ఇంట్లో దొంగలు పడ్డారు బాబోయ్..
బేస్తవారిపేటలో కొద్ది రోజుల కిందట జరిగిన భారీ చోరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. స్థానిక కాలువ బజార్లో నివాసముంటున్న జానపాటి ఆదినారాయణ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. ప్రతిరోజులాగే ఆయన దుకాణం నిర్వహించేందుకు కంభం వెళ్లగా, ఆయన భార్య కూడా రోజూలాగే పొలం పనులకు వెళ్లింది. ఈనెల 12న మధ్యాహ్నం సమయంలో ఆదినారాయణ ఇంటికి భోజనం కోసం వచ్చేసరికి ఎదురింట్లో ఉండే పగడాల ఆషియా అనే మహిళ తమ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ పెద్దపెట్టున ఏడుస్తూ వీధిలో హంగామా చేసింది..
ట్రంకు పెట్టె ఖాళీ..
దొంగలు పడ్డారన్న మాటతో ఆ వీధిలోని వాళ్లంతా గాభరా పడిపోయి.. తమ తమ ఇళ్లలోని సొత్తును చెక్ చేసుకున్నారు. డ్రైఫ్రూట్స్ వ్యాపారి ఆదినారాయణ సైతం హుటాహుటిన లోనికి పరుగెత్తి, మంచం కిందున్న ట్రంకు పెట్టెను తెరిచిచూడాడు. అంతే.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ట్రంకు పెట్టెలో దాచి ఉంచిన రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు మాయమైపోయినట్లు గుర్తించాడు. ఆషియాతోపాటు తన ఇంట్లోనూ దొంగతనం జరిగిందని ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే..
స్పెషల్ టీమ్ ఎంట్రీతో గుట్టు రట్టు..
రెండు ఇళ్లలో దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక టీమ్లను రంగంలోకి దించారు. కానీ ఎంతకీ సరైన క్లూస్ దొరకలేదు. చివరికి టెక్నాలజీ సాయంతో సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎదురింటి ఆషియా కదలికలపై అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి..
దొంగే దొంగా దొంగా అని అరిచి..
ఎదురింటి ఆదినారాయణ ఇంట్లో బంగారం, నగదును దొంగతనం చేసిన ఆషియా.. జనం దృష్టిని మళ్లించడానికి తన ఇంట్లోనే చోరీ జరిగిందని హైడ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. చివరికి ఆమె నేరాన్ని అంగీకరించక తప్పలేదు. ఆషియా నుంచి రూ.1.95 లక్షల నగదు, 112 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.