ప్రేమ పెళ్లి... ఐదు నెలలకే భార్య నుంచి ఊహించని షాక్... తట్టుకోలేక గ్రామ వాలంటీర్ ఆత్మహత్య...
ఏపీలో గ్రామ వాలంటీర్ల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో కొంతమంది వాలంటీర్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనపైనే వేధింపుల కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడు. ఐదు నెలలు సాఫీగా సాగిన తమ కాపురంలో భార్య ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అసలేం జరిగింది...
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన నాగేంద్రబాబు (25) స్థానికంగా గ్రామ వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను పనిచేసే గ్రామ సచివాలయంలోనే ఓ యువతి మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి... అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇరువురి కుటుంబాల్లో చెప్పారు. అయితే
అమ్మాయి తల్లిదండ్రులు అందుకు ససేమిరా అన్నారు.

పోలీసుల సమక్షంలో పెళ్లి
పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఐదు నెలల క్రితం చీరాల టూటౌన్ పోలీస్స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా కాపురం పెట్టారు. ఐదు నెలల పాటు అంతా సాఫీగా సాగిపోయింది. ఇదే క్రమంలో ఇటీవల యువతి తల్లిదండ్రులు వారి ఇంటికొచ్చారు. అమ్మాయిని పండుగకు తీసుకెళ్తామని అల్లుడికి చెప్పారు. అందుకు నాగేంద్రబాబు సరేనని చెప్పడంతో వెంట తీసుకెళ్లారు.
అంతే... అప్పటినుంచి భార్య ప్రవర్తనలో మార్పు మొదలైంది. ఉన్నట్టుండి ఓరోజు ఆమె నాగేంద్ర బాబుపై పోలీస్ కేసు పెట్టింది. తనను వేధిస్తున్నాడని,భయపెట్టి,బెదిరించి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది.

భార్య నుంచి ఊహించని షాక్... ఆత్మహత్య...
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా తనపై లేనిపోని ఆరోపణలు చేయడంతో నాగేంద్ర బాబు షాక్ తిన్నాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇదే క్రమంలో గురువారం(మార్చి 19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని ద్యాప్తు చేస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న వాలంటీర్ల ఆత్మహత్యలు...
గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం భట్లమాగుటూరులో గ్రామ వాలంటీర్ కె.మాధురి(25) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఒత్తిడి వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది. మృతురాలికి ఆరు నెలల పాప ఉంది. గతేడాది మార్చిలో తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండల పరిధిలోని ఓ గ్రామంలో మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడింది. అదే గ్రామంలో వాలంటీర్గా పనిచేసే మల్లాడి కృష్ణ (27) అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఇలా గడిచిన రెండేళ్లలో పలువురు గ్రామ వాలంటీర్లు రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications