చావు దాకా వెళ్లినదానికన్నా అదే బాధ: ప్రకాష్ రాజ్
హైదరాబాద్: తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఒకింత వేదాంత ధోరణిలో ప్రతిస్పందించారు. జీవితం ఎంత క్షణభంగురమో, మనం ఎంత నిస్సహాయులమో తెలిసి వచ్చిందని, ఉన్నన్నాళ్లు జీవించడమే మనం చేయగలిగిన పని ఆయన అని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం తనను కొద్దిసేపు కుదిపివేసినప్పటికీ తర్వాత కుదుట పడ్డానని తెలిపారు.
మనుషుల తీరుపై ప్రకాష్ రాజ్ తీవ్ర ఆవేదన, అసహనం వ్యక్తం చేశారు. ‘ఇదేనా పద్ధతి! ఇదా మానవత్వం! మనం ఎక్కడికి పోతున్నాం! సిగ్గు సిగ్గు'... అని అన్నారు. మంగళవారం రాత్రి ప్రకాశ్రాజ్ ప్రయాణిస్తున్న కారును మాదాపూర్ - శంషాబాద్ దారిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో ప్రకాశ్రాజ్ కారు దెబ్బతింది. అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా ఆయన బయటపడ్డారు.
అదే బస్సు పక్కనున్న ఓ ఆటోను కూడా ఢీకొంది. ఆటోలో ఉన్న ఓ కుటుంబ సభ్యులు కింద పడిపోయారు. అక్షయ (3) అనే చిన్నారి గాయపడింది. చుట్టుపక్కల ఉన్నవారు నడిరోడ్డుపై పడిపోయిన వారిని కాపాడాల్సిందిపోయి, ప్రకాశ్రాజ్ ఫొటోలను తీయడంలో బిజీగా ఉండిపోయారు. దీనిపై ప్రకాశ్రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘మా వాహనాన్ని బస్సు ఢీకొంది. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన వారు ఆటోలోంచి రోడ్డుమీదికి విసిరేసినట్లుగా పడిపోయారు. అక్కడంతా తీవ్ర గందరగోళం! కిందపడిపోయిన వారిని కాపాడాల్సిందిపోయి చాలామంది యువకులు ఫొటోలు తీయడంలో బిజీగా ఉండటం చూసి చలించిపోయాను. సిగ్గుసిగ్గు! చావు దగ్గరిదాకా వెళ్లానన్న షాక్కంటే... వీరి అమానవీయ చేష్టలే నాకు దిగ్ర్భాంతి కలిగించాయి. మనకేమైంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం?'' అని ప్రకాశ్ రాజ్ ఆవేదనగా ప్రశ్నించారు.
ఈ సంఘటనపై ప్రకాశ్రాజ్తోపాటు ఆటోడ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.