ప్రకాశం జిల్లా:గ్రానైట్ ఫ్యాక్టరీ షెడ్డు కూలి ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
ఒంగోలు:ప్రకాశం జిల్లాలో ప్రకృతి ప్రకారం కారణంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ షెడ్డు కుప్పకూలి పోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో 10 మందికి గాయపడ్డారు.
ఈ ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడులో చోటు చేసుకుంది. గ్రామంలోని గోరంట్ల రవికుమార్ అనే వ్యక్తికి చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీ షెడ్డు నిర్మాణం ఇటీవలే పూర్తి కాగా ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. బుధవారం హఠాత్తుగా ఉరుములతో కూడిన భారీ వర్షం ప్రారంభం కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు,సమీపంలోని పశువుల కాపరులు సుమారు 20 మంది వర్షానికి తలదాచుకోవడం కోసమని ఆ షెడ్డులోకి వెళ్లారు.
అయితే భారీ వర్షం కారణంగా నానుడుకు గురైన ఫ్యాక్టరీ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఈ ప్రమాదంలో నక్కబొక్కలపాడుకు చెందిన గోగినేని పూర్ణమ్మ(48), చెన్నుపల్లి గ్రామానికి చెందిన ఏసు మరియమ్మ (37) అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. నక్కబొక్కలపాడుకు చెందిన సిపిఎం కార్యకర్త అట్లూరి వెంకటేశ్వర్లు (65)కు తీవ్ర గాయాలవడంతో ఆయన్ను నర్సరావుపేట ఆస్పత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్.ఐ. నాగరాజు, సీఐ ఎం.హైమారావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నా... భారీ వర్షం కురుస్తూనే ఉండటంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టే వీలులేకపోయింది. వర్షం నిలిచిన తర్వాత పోలీసులు సహాయ చర్యలు ప్రారంభించారు. దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. గ్రానైట్ యూనిట్ నిర్మాణ పర్యవేక్షకుడు కొణిదెనకు చెందిన బండి హనుమయ్య ద్వారా వివరాలు సేకరించారు.
ఇదే ప్రమాదంలో మరో 10 మంది గాయపడగా వారిని చిలకలూరిపేట, గుంటుపల్లి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో ఒక కారు, పది ద్విక్రవాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాధ ఘటనా స్థలాన్ని ఎస్పీ సత్యఏసుబాబు, ఎమ్మెల్యే రవికుమార్, ఎస్సై వై నాగరాజు పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. షెడ్డు కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.