తెలంగాణ ప్రభుత్వానికి ప్రణబ్ కితాబు, ఓల్డ్సిటీపై కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాదులో జరుగుతున్న మెట్రొపొలిస్ సదస్సులో గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కితాబిచ్చారు. కొత్త రాష్ట్రంలో జరిగిన ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని అభినందించారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఆయన అభినందనలు తెలిపారు. మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్లో ప్రణబ్ మాట్లాడారు.
19వ శతాబ్దం నుండి పట్టణీకరణ చాలా వేగంగా సాగుతోందని, 21వ శతాబ్దం పూర్తిగా నగరాలదే అన్నారు. ప్రపంచంలో నగరాల్లో 50 శాతం జనాభా నివసిస్తోందన్నారు. పట్టణాలు, ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు పెద్ద ఎత్తున నిధులు అవసరమన్నారు. నగరాల్లో విద్యుత్, నీరు, రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలన్నారు.
శానిటేషన్ పెద్ద సమస్యగా మారిందన్నారు. వచ్చే ఐదేళ్లలో స్వచ్ఛ భారత్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాలుష్యం నగరాలకు పెను సవాల్గా మారిందన్నారు. వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరిశుభ్రతకు నగర పాలకులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
మెట్రోపొలిస్ సదస్సులో కేసీఆర్ మాట్లాడుతూ... మురికి వాడలు లేని హైదరాబాదుకు తాము కృషి చేస్తున్నామన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరాల్లో అతి కొద్దిగా మాత్రమే భూమి ఉంటోందని, ఉన్న దానినే సద్వినియోగం చేసుకోవాలన్నారు.
క్రమంగా భూమి లభ్యత తగ్గుతూ వస్తోందన్నారు. మెట్రో నగరాల్లో మురికి వాడలు లేకుండా చేయాలన్నారు. మురికివాడల స్థానంలో శాటిలైట్ టౌన్షిప్లు రావాలన్నారు. వారసత్వ కట్టడాలకు నష్టం కలగకుండా ఇస్తాంబుల్ తరహాలో కట్టడాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో ఇస్తాంబుల్ తరహాలో నిర్మాణాలు ఉండాలన్నారు.
కాగా, కేసీఆర్ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తారు. హైకోర్టును త్వరగా విభజించాలని ఆయన కోరనున్నారు. విద్యుత్ సమస్య పైన సైతం ఆయన కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. అలాగే కంటి పరీక్ష చేయించుకోనున్నారని సమాచారం.