ప్రశాంత్ కిషోర్కు బిగ్ టాస్క్- శ్రీవారి దర్శనంతో
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 67,192 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,825 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.15 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

నేడు తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోన్నారు టీటీడీ అర్చకులు. తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థోత్సవాలలో ఒకటి రామకృష్ణతీర్థ ముక్కోటి. గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయనుంది.
ఈ తెల్లవారు జామున 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు టీటీడీ అధికారులు. అక్కడ భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, మంచినీటి వసతిని కల్పించనున్నారు.
సాయంత్రం పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. భక్తులకు దర్శనమిస్తారు.
ఈ రెండు పర్వదినాలను పురస్కరించుకుని.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ తిరుమలకు వచ్చారు. భార్యతో కలిసి ఈ తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రే ఆయన చెన్నై నుంచి తిరుమలకు చేరుకున్నారు.
పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రశాంత్ కిశోర్కు ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో టీటీడీ అర్చకులు వేదాశ్వీర్వచనాలు పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టారు ప్రశాంత్ కిషోర్. దళపతి విజయ్కు చెందిన తమిళగ వెట్రీ కజగం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. ఇదివరకే విజయ్తో ఆయన భేటీ అయ్యారు కూడా. చెన్నై పనైయూర్లో విజయ్ భేటీ అయ్యారాయన. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.












Click it and Unblock the Notifications