సోనియా తో ప్రశాంత్ కిషోర్ భేటీ : జాతీయ రాజకీయాల్లో కీలకంగా : జగన్ ఎటు - టీడీపీతో తేలితేనే..!!
జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ప్రధాని మోదీ వ్యతిరేక పక్షాలు ఏకం అవుతున్నాయి. ప్రధాని మోదీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించే లక్ష్యంతో పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో సమావేశమయ్యారు. ఆయన అధికారికంగా పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రాజకీయ వ్యూహకర్తగా 2014 నుంచి ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీల విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పని చేసాయి. ఇక, ఇప్పుడు బీజేపీ ఎదుర్కోవాలంటే..కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి పని చేసినా..అది సాధ్యపడదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

కీలకంగా మారుతున్న ప్రశాంత్ కిషోర్
ఈ పరిస్థితుల్లో ప్రముఖ ప్రాంతీయ పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో కలిసి ఆ పార్టీలను మోదీకి వ్యతిరేకంగా పని చేసేలా బాధ్యతలు తీసుకోనున్నారు. ముందుగా రాష్ట్రపతి ఎన్నిక ద్వారా ప్రధాని కి రాజకీయంగా చెక్ పెట్టాలనేది కాంగ్రెస్ - ప్రశాంత్ కిషోర్ వ్యూహంగా తెలుస్తోంది. అందు కోసం ఎన్డీఏ బలపర్చిన అభ్యర్ధికి పోటీగా ఎవరిని రంగంలోకి దించాలనే అంశం పైన ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ కీలకంగా మారారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన డబ్బుల కోసం పని చేయరంటూ ప్రశంసించారు.

కేసీఆర్ ఓకే..మరి జగన్ రూటు ఎటు
ఆయనతో కలిసి తాము ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో అధికార పార్టీ పరిస్థితి పైన క్షేత్ర స్థాయిలో అధ్యయనంతో పాటుగా.. రాజకీయంగానూ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఏపీ సీఎం జగన్ కు 2019 ఎన్నికల్లో గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ తన వంతు సహకారం అందించారు. దీంతో..2024 ఎన్నికల కోసం ముందుగానే ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది. జూలై 8న జరిగే పార్టీ ప్లీనరీకి ప్రశాంత్ కిషోర్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, జగన్ ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చన సమయంలో రాష్ట్రపతి ఎన్నికనూ తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా వైసీపీలో చర్చ వినిపిస్తోంది.

టీడీపీతో వైఖరి పై క్లారిటీ వస్తేనే
అయితే, కేంద్రానికి వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు జగన్ పని చేసే అవకాశాలు కనిపించటం లేదు. ప్రశాంత్ కిషోర్ సేవలను రాజకీయ వ్యూహాలకు..సర్వేలకు..సూచనలకు మాత్రమే వినియోగించుకొనే అవకాశం ఉంది. 2024 ఎన్నికల ముందు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అందునా..తిరిగి 2014 పొత్తులు రిపీట్ అవుతాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్ పైన పోరాటానికి టీడీపీ- బీజేపీ - జనసేన కలుస్తాయని చెబుతున్నారు. అయితే, బీజేపీ మరోసారి టీడీపీతో కలవటానికి సిద్దంగా లేదనేది మరో వాదన. దీంతో..బీజేపీ ఏపీలో ఏ విధంగా వ్యవహరిస్తుందో చూసిన తరువాత జగన్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అటు ఏపీ..ఇటు తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications