జగన్ రొట్టె విరిగి నేతిలో పడింది?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ పనిచేస్తోంది. అంతేకాకుండా పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా వ్యూహకర్తగా పనిచేయడానికి ఒప్పందం కదుర్చుకున్నారు. అయితే తెలంగాణకు గుడ్ బై చెప్పడంతో ఐప్యాక్ బృందమంతా పొరుగునే ఉన్న ఏపీకి తరలివచ్చింది. కొందరు మాత్రం హైదరాబాద్ లో ఉన్నారు.
మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండటం కలిసివస్తోంది
మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండటంతో పీకే బృందం రాష్ట్రవ్యాప్తంగా విస్త్రతంగా పర్యటించబోతోంది. ఇప్పటివరకు చాపకింద నీరులా వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వచ్చిన ఐప్యాక్ ఉద్యోగులు ఇకనుంచి బహిరంగంగానే ప్రజల్లోకి రాబోతున్నారు. వారం వారం నివేదికలను ముఖ్యమంత్రికి అందజేస్తున్న ఐ ప్యాక్ ప్రస్తుతం రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో పనిచేస్తోంది. ఇకనుంచి సర్వేలోని సభ్యులంతా మంత్రులను, ఎమ్మెల్యేలను నేరుగా కలవబోతున్నారు.
ఈనెల 15న ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేయబోతున్నారు
ఈనెల 15వ తేదీన ప్రతి ఎమ్మెల్యేకు ఒక్కో ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేయబోతున్నట్లు ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. దీనికి రెండువారాలు ముందుగానే ఐప్యాక్ ప్రతినిధి సొంతంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
తమ పర్యటనలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను ముఖ్యమంత్రికి అందజేయడంతోపాటు ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా అందించబోతున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఏ వివరాలైతే ఉంటాయో అవే వివరాలు ఎమ్మెల్యేల దగ్గర ఉండబోతున్నాయి. రాజకీయాలతో సంబంధంలేనివారిని కూడా వీరు కలవబోతున్నారు.
మంత్రులకు, ఎమ్మెల్యేలకు సహకారం
తమ పర్యటనల్లో వచ్చిన వివరాలపై ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులతో వీరు సమావేశమవుతారు. మైనస్ పాయింట్లుంటే వాటిని పాజిటివ్ గామార్చుకోవాలి? ప్లస్ పాయింట్లు ఇంకా ఎలా పెంచుకోవాలి? తదితర విషయాల్లో వీరు వారికి సహకరించబోతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇల్లిల్లూ తిరిగే ఎమ్మెల్యే, మంత్రులంతా ఇప్పుడు ఐ ప్యాక్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
ఒకరకంగా ఇది జగన్ కు కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్త్రతంగా పర్యటించి మరింత లోతుగా రాజకీయాలను విశ్లేషించే అవకాశం ఉంటుందంటున్నారు.