ఫిరాయింపుల దుమారం: టిడిపిని దుమ్మెత్తిపోసిన వైసిపి ఎమ్మెల్యేలు
విజయవాడ/ ఒంగోలు: పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ జరిగిన ప్రచారం తీవ్ర దుమారం రేపింది. ఇటు తెలంగాణలో టిడిపి శాసనసభ్యులు తెరాసలో చేరిన నేపథ్యంలో ఎపిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలో చేరబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను వైయస్సార్ కాంగ్రెసు నూజివీడు శాసనసభ్యుడు ప్రతాప్ అప్పారావు ఖండించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిలువెత్తు డబ్బు పోసినా తాను తెలుగుదేశం పార్టీలో చేరే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు .
తాను పార్టీ మారుతున్నట్లు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై దుష్ప్రచారం చేసతున్నారని ఆయన విమర్శించారు. తాను చివరి వరకూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. టిడిపి మునిగిపోయే పడవ అని, ఆ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, తాము పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఖండిచారు. తామంతా జగన్ వెంటే ఉన్నామని వారు గురువారంనాడు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో టిడిపి ఖాళీ అవుతున్న విషయం నుంచి దృష్టి మళ్లించడానికి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వారన్నారు. తమ పార్టీని బలహీనపరిచేందుకు చౌకబారు రాజకీయం చేస్తున్నారని కూడా అన్నారు.
తాము వైసీపీ తరుపున గెలిచాం, ఆ పార్టీలోనే కొనసాగుతామని ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అశోక్రెడ్డి, రవి, వెంకటరెడ్డి, రామారావు, సురేష్, డేవిడ్రాజు స్పష్టం చేశారు. గురువారం వారు సంతమాగులూరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ విషయం స్పష్టం చేశారు. తాము పార్టీ మారుతున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని వారు స్పష్టం చేశారు.
తమ పార్టీ శాసనసభ్యులు ఎవరూ పార్టీ మారబోరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకాశం జిల్లా నాయకుడు బాలినేని స్పష్టం చేశారు. పార్టీ మారుతారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో ఆరుగురు శాసనసభ్యులు వైయస్ జగన్ను కలిశారు.
ప్రకాశం జిల్లాలో తాము ఎవరం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడడం లేదని శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని అన్నారు. వైయస్ జగన్ వల్లనే తాము గెలిచామి, చివరి వరకూ జగన్తోనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
తాను టిడిపిలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పార్టీ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని ఆమె చెప్పారు. చంద్రబాబు అస్తమించే సూర్యూడు కాగా, జగన్ ఉదయించే సూర్యుడని ఆమె వ్యాఖ్యానించారు భవిష్యత్తు కావాలనుకునేవారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడబోరని ఆమె స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీలో చేరుతానంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విశాఖపట్నం జిల్లా మాడుగుల శాసనసభ్యుడు ముత్యాలనాయుడు అన్నారు. పార్టీ మారేంత నీతిమాలిన రాజకీయాలు తాను చేయబోనని ఆయన గురువారం స్పష్టం చేశారు. చివరి వరకూ జగన్తోన్ ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications