ముంచుకొస్తోన్న గడువు: ఇక రెండురోజులే: జగన్ సర్కార్కు కొత్త టెన్షన్
అమరావతి: జగన్ సర్కార్-ప్రభుత్వ ఉద్యోగుల మధ్య తలెత్తిన పీఆర్సీ వివాదం సద్దుమణగట్లేదు. పీఆర్సీని అమలు చేసేలా జారీ చేసిన జీవోలను మంత్రివర్గం ఆమోదించడంతో ఇది కాస్తా మరింత ముదిరినట్టయింది. ఏ మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు దశల వారీగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. వాటిని అమలు చేస్తోన్నారు. ఈ కార్యాచరణలో భాగంగా ఇవ్వాళ రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్లో..ఒకే హోటల్లో ధనుష్, మాజీ భార్య: విడాకుల తరువాత..అనూహ్యంగా
ఉద్యమ కార్యాచరణలో ఉద్యోగులు..
ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇదివరకే ప్రభుత్వానికి తమ సమ్మె నోటీసును అందజేశారు. ఇవ్వాళ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించనున్నారు. ఎల్లుండి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 26వ తేదీన రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. 27 నుంచి 30వ తేదీ వరకు వర్క్ టు రూల్లోకి వెళ్లనున్నారు. ఆ తరువాత ప్రభుత్వ యాప్స్ను షట్డౌన్ చేయనున్నారు. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో దిగనున్నారు.
వేతనాల చెల్లింపులు ఎలా..?
ఈ పరిణామాల మధ్య ఉద్యోగులకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జీతాలను ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ట్రెజరీని ఆదేశించింది. కొత్త జీవోల్లో పొందుపరిచిన పే స్కేల్స్కు అనుగుణంగా వేతనాల చెల్లింపులు చేసేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలనీ సూచించింది. ట్రెజరీ ఉద్యోగులు కూడా ఉద్యమ కార్యాచరణలో భాగం కావడం వల్ల అది కుదరట్లేదు. పీఆర్సీ జీవోలను వారు కూడా వ్యతిరేకిస్తోన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను అసలు ప్రారంభించనేలేదు. దీనితో ఉద్యోగులకు ఫిబ్రవరిలో జీతాలు అందుతాయా? లేదా? అనేది ఉత్కంఠతను రేపుతోంది.
గడువులోగా..
ఉద్యోగులకు వేతనాల చెల్లింపునకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయితే తప్ప జనవరి నెలకు సంబంధించిన వేతనాలు ఉద్యోగులకు అందవు. దీనికోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు రోజుల కిందట ఇచ్చిన ఉత్తర్వులను ట్రెజరీ ఉద్యోగులు పట్టించుకోలేదు. దీనితో తాజాగా మరోసారి ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీనిపైనా పెద్దగా స్పందన లేదనే తెలుస్తోంది. ఉద్యమం ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కాలేకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇది పూర్తయితే గానీ ఉద్యోగులకు జనవరి నెలకు సంబంధించిన వేతనాలు అందవు.
మెట్టుదిగని ప్రభుత్వం..
ఉద్యోగుల డిమాండ్ల పట్ల అటు ఏపీ ప్రభుత్వం కూడా మెట్టు దిగట్లేదు. కొత్త వేతనాలను మంజూరు చేస్తూ జారీ చేసిన జీవోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సమావేశమైన మంత్రివర్గం కూడా ఆమోదించింది. కొత్త జీవోలకు ఆమోదముద్ర పడటంతో అవే అమల్లోకి వచ్చినట్టయింది. కొత్త జీవోల్లో పొందుపరిచన విధంగా సవరించిన వేతనాలను ఎలా చెల్లించలనేది ప్రస్తుతం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులను నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు తాము పట్టినపట్టును వీడట్లేదు.