అనూహ్యమైన మలుపులు తీసుకుంటున్న ఏపీ రాజకీయం
రాజకీయ సలహాదారులు చెప్పిందే పార్టీలకు వేదమవుతోంది. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో మరిన్ని సలహాలు, సూచనలు వీరు అందజేయబోతున్నారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీతోపాటు ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రజల ఆలోచనా తీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నాయి. తాము ఏయే అంశాల్లో బలంగా ఉన్నాం.. ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నాం.. పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై రెండు పార్టీలకు ఎన్నికల స్ట్రాటజిస్టులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
వైసీపీకి నివేదికలందజేస్తోన్న ఐప్యాక్
వైఎస్సార్ సీపీకి రాజకీయ సలహాదారుగా ఐప్యాక్ పనిచేస్తోంది. ప్రతి నెలకు ఒకసారి సర్వే నిర్వహించి నివేదికను అందజేస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ వేర్వేరు మార్గాల్లో కూడా సర్వేలు తెప్పించుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఐప్యాక్ రూపొందించినదే. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చాలా? అక్కడి పరిస్థితి ఏమిటి? ప్రత్యర్థి పార్టీ పరిస్థితి ఏమిటి? తదితరాలన్నింటినీ నియోజకవర్గాలవారీగా వైసీపీ అధిష్టానానికి ఐప్యాక్ అందజేస్తోంది.
సీనియర్లను వదిలించుకోవాలంటూ టీడీపీకి సలహా
తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుగా ఉన్న రాబిన్ శర్మ బాదుడే బాదుడు, ఇదేంఖర్మ కార్యక్రమాలను రూపొందించారు. వీటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమవడంతో ఆయనపై చంద్రబాబు మరింత నమ్మకం ఉంచారు. నారా లోకేష్ పాదయాత్ర కూడా రాబిన్ శర్మ సూచనల మేరకే జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. తాజాగా రాబిన్ శర్మ టీం తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులపై సర్వే నిర్వహించి నివేదికను అందజేసింది. పార్టీకి తెల్ల ఏనుగులా మారినవారిని వదిలించుకోవాలని, అలాంటివారివల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని సూచించినట్లు తెలుస్తోంది.
రాజకీయ సలహాదారులు చెప్పిందే వేదం
రానున్నది ఎన్నికల కాలం కావడంతో వైసీపీ తరఫున ఐప్యాక్ చెప్పిందే వేదం కాబోతోంది. టీడీపీలో రాబిన్ శర్మ టీం చెప్పిందే శాసనంగా మారబోతోంది. మున్ముందు మరికొన్ని సంస్థల చేత ఇరు పార్టీలు సర్వేలు నిర్వహింపచేసుకొని క్రాస్ చెక్ చేసుకోబోతున్నాయి. వైసీపీ తరఫున ప్రజాప్రతినిధులంతా గడప గడపకు మన ప్రభుత్వంద్వారా ప్రజల చెంతకు వెళుతున్నారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ద్వారా ప్రజల చెంతకు వెళుతున్నారు. ఇంకోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంద్వారా ప్రజల చెంతకు చేరువయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఏదైనప్పటికీ, కార్యక్రమం ఏదైనప్పటికీ అందరి లక్ష్యం ప్రజల మనసులు గెలుచుకోవడమే. ఓటరన్న ఎవరిరి ఆశీర్వదిస్తాడో చూడాలి మరి.