'ఆమె' గురించి ఆరా తీసిన చంద్రబాబు?
మంత్రి అప్పలరాజు నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నరాని టీడీపీ భావిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ, టీడీపీ హోరాహోరీగా ఇప్పటి నుంచే తలపడుతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ నాయకుణ్ని నిలబెట్టబోతున్నారు? దానికి విరుగుడుగా మన అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? లాంటి చర్చలన్నీ రెండుపార్టీల్లో జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుండగా టీడీపీ తరఫున 'యువగళం' పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.

మంత్రిపై రోజురోజుకు పెరుగుతోన్న వ్యతిరేకత
ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న సీదిరి అప్పలరాజుపై రోజురోజుకు పలాస నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయం పార్టీ అధిష్టానానికీ తెలుసు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ ఛార్జిగా ఫైర్ బ్రాండ్ గౌతు శిరీష ఉన్నారు. అప్పలరాజుపై ఉన్న వ్యతిరేకతను ఆమె తనకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారని పార్టీ అధిష్టానం భావిస్తోంది. టీడీపీ అంతర్గతంగా నిర్వహించుకున్న సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సీనియర్ నేత గౌతు శివాజీ కుమార్తెగా, గత ఎన్నికల్లో ఓటమిపాలైన నేతగా ప్రజల్లో సానుభూతి ఉందని, ఈ రెండు అంశాలను ఆమె తనకు అనుకూలంగా ఉపయోగించుకోలేకపోతున్నారని అధిష్టానం గుర్తించింది.

పలాస గురించి ఆరా తీసిన చంద్రబాబు
శిరీష అప్పలరాజును ఎదుర్కోవడంలో ఎక్కడ వెనకబడుతోంది? ఏ పోరాటంతో ఆమె మళ్లీ టీడీపీ పుంజుకునేలా చేయగలదు? అందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళికను ఏవిధంగా అమలు చేయాలి? అనే విషయంలో సర్వే నిర్వహించిన సంస్థ నుంచి నివేదిక తీసుకున్నారు. నియోజకవర్గంలో క్యాడర్ కూడా బలంగా ఉంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేయడం దాదాపు ఖాయమైపోయింది. ఏ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలి అనే విషయం ఒక్కటే మిగిలింది. జనసేనకు ఇవ్వదగిన నియోజకవర్గాల గురించి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో నే ఆయన పలాస నియోజకవర్గం గురించి ఆరా తీశారు.

కౌన్సిల్ కు పంపిద్దామనే యోచనలో బాబు
గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ సీటు విషయంలో శిరీషకు ఎటువంటి ఇబ్బంది లేదు. సీటు తమకే కావాలంటూ ఎవరినుంచి పోటీ కూడా లేదు. అయితే జనసేన పలాస నియోజకవర్గాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మత్స్య కారుల్లో పవన్ కు మంచి ఆదరణ ఉండటంతోపాటు పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోను జనసేన రోజురోజుకు పుంజుకుంటోంది. స్థానికంగా ఉన్న జనసేన నేతలు మత్స్యకార ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీకి పునాదులు ఏర్పాటు చేస్తున్నారు. పలాస కోసం జనసేన గట్టిగా పట్టుబడితే శిరీషను ఎమ్మెల్సీగా కౌన్సిల్ కు పంపిద్దామనే యోచనలో అధినేత ఉన్నారు.












Click it and Unblock the Notifications