మీరెప్పుడూ వెల్లోనే: చెవిరెడ్డితో లోకేష్, బొజ్జలకు చేదు అనుభవం, కోవింద్ పర్యటన హైలైట్స్!
'మీరెప్పుడూ అసెంబ్లీ వెల్లోనే ఉంటారు.. మాపై విమర్శలు చేస్తూనే ఉంటారు.. మిమ్మల్ని మేము చూస్తూనే ఉంటాము' అని లోకేష్ కామెంట్ చేశారు.
తిరుమల: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద ఇస్తీకఫల్ అర్చకులు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ జేఓ శ్రీనివాసరాజు, సీవీఎస్వో రవికృష్ణ, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్లు స్వాగతం పలికారు.
రాష్ట్రపతి కోవింద్ శ్రీవారి దర్శించుకున్న సమయంలో.. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి రాష్ట్రపతి దంపతులకు తీర్థప్రసాదాలు, శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు.
తెలుగునేల స్ఫూర్తిదాయకం:
శుక్రవారం రోజు ఎస్వీయూ యూనివర్సిటీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాతవాహనుల నుంచి ఆంధ్రకేసరి హయాం వరకు తెలుగు నేల స్పూర్తిదాయకమైన నేతలను సొంతం చేసుకుందని కొనియాడారు.
ఎన్టీఆర్, పీవీ నరసింహా రావు వంటి గొప్ప నాయకులను, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి వంటి దేశాధ్యక్షులను అందించిన ఘనత ఏపీకి ఉందన్నారు. తన సహచరుడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఏపీ నుంచే వచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
పేదల కన్నీరు తుడిచిన మహానుభావుడు:
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను గవర్నర్ ప్రశంసల్లో ముంచెత్తారు. కోవింద్ పేదల కన్నీరు తుడిచేందుకు పుట్టిన మహానుభావుడు అని పేర్కొన్నారు. బీహార్ గవర్నర్ గా పనిచేసిన రోజుల్లో తమ మధ్య పరిచయం బాగుండేదని గుర్తుచేసుకున్నారు.
కోవింద్ ను ఉన్నత విలువలు కలిగివున్న వ్యక్తిగా చంద్రబాబు ప్రశంసించారు. తాను చదువుకున్న కళాశాలలో కోవింద్ కు సన్మానం చేయడం పూర్వ జన్మ సుకృతమని అన్నారు.
వేదపండితుల ఆశీర్వాదం:
అంతకుముందు పౌర సన్మానంలో భాగంగా తొలుత వేదపండితులు రాష్ట్రపతిని ఆశీర్వదించారు.
నరసింహన్, చంద్రబాబు రాష్ట్రపతి మెడలో పూలమాలలు వేసి పుష్పగుచ్చాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన దళిత లబ్దిదారులకు భూమి పట్టాలను, నిరుపేద మహిళలకు రుణాలను రాష్ట్రపతి అందజేశారు. అంతకుముందు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
పద్మావతి బోధనాసుపత్రి ప్రారంభం:
పౌర సన్మానానికి ముందు కోవింద్ స్విమ్స్ ప్రాంగణంలో రూ.139కోట్లతో నూతనంగా నిర్మించిన పద్మావతి బోధనాసుపత్రిని ప్రారంభించారు. అనంతరం రూ.25కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం తిరుపతిలో నిర్మించే అంబేడ్కర్ సిల్క్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
శిల్పారామంలో ఆతిథ్యం:
రాత్రి 7.15గం.కు శిల్పారామంలో రాష్ట్రపతి గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం శిల్పారామంలో ఆత్మీయ ఆతిథ్యం ఏర్పాటు చేసింది. అనంతరం కోవింద్ తిరుమలకు వెళ్లి పద్మావతి అతిథి గృహంలో బస చేశారు.
మీరెప్పుడూ వెల్లోనే, లోకేష్-చెవిరెడ్డి సంభాషణ:
శిల్పారామంలో రాష్ట్రపతికి ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చిన సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా శిల్పారామానికి వచ్చారు.
ఆ సమయంలో వీఐపీలను పలకరిస్తూ లోకేష్ చెవిరెడ్డికి ఎదరుపడ్డారు. దీంతో చెవిరెడ్డితోను మాట కలిపే ప్రయత్నం చేసిన లోకేష్ కొన్ని సరదా వ్యాఖ్యలు చేశారు. 'మీరెప్పుడూ అసెంబ్లీ వెల్లోనే ఉంటారు.. మాపై విమర్శలు చేస్తూనే ఉంటారు.. మిమ్మల్ని మేము చూస్తూనే ఉంటాము' అని లోకేష్ కామెంట్ చేశారు.
లోకేష్ వ్యాఖ్యలకు మౌనం దాల్చిన చెవిరెడ్డి.. ఆయనకు నమస్కరించి, చిన్నగా నవ్వుకుంటూ అక్కడినుంచి బయటపడ్డారు.
బొజ్జలకు చేదు అనుభవం:
వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన రాష్ట్రపతికి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విమానశ్రయంలో స్వాగతం పలకడానికి వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో బొజ్జల నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా మేరకే తాము నేతలను అనుమతిస్తామని సెక్యూరిటీ బొజ్జలతో చెప్పారు. దీంతో జాబితాలో స్థానిక ఎమ్మెల్యే అయిన బొజ్జల పేరు ఎందుకు చేర్చలేదంటూ ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు వాగ్వాదానికి దిగారు. చివరకు బొజ్జలను ఉన్నతాధికారులు లోనికి అనుమతించడంతో సమస్య సద్దుమణిగింది