పవన్ కళ్యాణ్పై ఒత్తిడి: నిన్న ప్రత్యేక హోదా, నేడు నోటుకు ఓటు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏది వచ్చినా సరే జనసేన అధినేత, తెలుగు సినిమా హీరో పవన్ కళ్యాణ్కు చుట్టుకుంటోంది. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధానికి భూమి సేకరణ వంటి అంశాలపై పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరిగింది. ఆయనకు ప్రశ్నలు సంధించారు. హీరో శివాజీ కూడా ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలు చేపట్టి, ప్రత్యేక హోదా కోసం పోరాటానికి ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ను కోరారు.
రాజధానికి భూమి సేకరణ విషయంలో రైతు సమస్యలపై ఆయన స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు అనుగుణంగా ఆయన స్పందించారు. కాగా, ఇప్పుడు నోటుకు ఓటు కేసు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ను పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం, బిజెపి కూటమిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
తాను ప్రశ్నిస్తానంటూ ఆయన చెప్పిన మాటలను ఇప్పుడు ఆయనను విమర్శించడానికి రాజకీయ నాయకులు, ఇతరులు ఎంచుకుంటున్నారు. తాజాగా, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. వన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడదు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పో ఒప్పో పవన్ కళ్యాణ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో ఆయన ఈ ప్రశ్నలు వేశారు.
ఇక రామ్ గోపాల్ వర్మ అయితే, పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభ్యుల కొనుగోలుకు ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కుటున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై పవన్ స్పందించకపోవడాన్ని రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో నిలదీశారు. ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించనపుడు లోక కల్యాణానికి ద్రోహమని ఆయన అన్నారు. ఇది కల్యాణ ద్రోహం అంటూ పవన్పై ప్రత్యక్ష సెటైర్లు వేశారు. పాలకులను ప్రశ్నిస్తాననేవాడు ప్రశ్నించనపుడు కల్యాణం కోరుకునే జనాలకు పెళ్లెప్పుడు అంటూ మరో ట్వీట్ పేల్చారు.
మొత్తం మీద, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేలు పెట్టి విమర్శలు ఎదుర్కుంటున్నారు. చంద్రబాబుకు ఆయన వెన్ను దన్నుగా నిలవడంపై ఓ వర్గం రాజకీయ నాయకులు తీవ్రంగానే మండిపడుతున్నారు.