ప్రత్యేక హోదా: చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి, బిజెపి వైపు మళ్లింపు

విజయవాడ: ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ప్రత్యేక హోదాపై బిజెపి దాదాపుగా ఒంటరి అయింది. తనపై పెరుగుతున్న ఒత్తిడిని చంద్రబాబు బిజెపిపైకి మళ్లించే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది చెప్పే పరిస్థితి లేదు.

ప్రత్యేక హోదాపై అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు రేపు ఆదివారం పార్టీ పార్లమెంటు సభ్యులతో చర్చించనున్నారు. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణకు రూపకల్పన చేస్తారు. రాజ్యసభలో కేంద్ర మంత్రిగా ఉంటూ సుజనా చౌదరి, ఎంపి సిఎం రమేష్ కేంద్ర ప్రభుత్వంపై, బిజెపిపై తీవ్రంగానే విమర్శలు చేశారు. దానివల్ల బిజెపి ఒంటరి అయినట్లు కనిపిస్తోంది.

అయితే, ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి ముందే తెలుసనేది నిర్వివాదాంశం. దాన్ని ఏదో విధంగా దాటవేయాలనే ప్రయత్నంలోనే వారిద్దరితో పాటు కేంద్ర ప్రభుత్వం ఉందనేది ప్రతిపక్షాల విమర్శ. దాదాపు ఆ విషయం తేలిపోయిందని భావించిన తరుణంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించడం ద్వారా అగ్గి రాజేశారు.

చంద్రబాబు బిజెపి వైపు వేలెత్తి చూపుతున్నప్పటికీ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ప్రధానంగా ఆయననే లక్ష్యం చేసుకున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడమేమిటనేది ఆ పార్టీల ప్రశ్న. కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడానికి చంద్రబాబు భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంటున్నారు. అందుకు ఆయన వివిధ కారణాలు చూపుతున్నారు.

Pressure mounts on chandrababu, he blames BJP

తమపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు బిజెపిపై కాస్తా ఎక్కువగానే దాడి చేస్తున్నారు. అవసరమైతే రాజీనామాలు చేస్తామని మురళీమోహన్‌తో పాటు కేశినేని నాని అన్నారు. పొమ్మనలేక పొగపెడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు బిజెపి నేతలపై మండిపడ్డారు. బుచ్చయ్య చౌదరి వంటి ఇతర నాయకులు కూడా బిజెపిపై మండిపడ్డారు.

అయితే, చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకుంటారా అనేది ప్రశ్న. జగన్ కావాల్సింది ఆ తెగదెంపులు. కానీ చంద్రబాబు ఇప్పటికిప్పుడు అందుకు సిద్ధంగా లేనట్లే కనిపిస్తున్నారు. బిజెపిని కార్నర్ చేస్తూనే మిత్రపక్షంగా వ్వహరించాలనే వ్యూహాన్ని ఆయన అనుసరించేట్లు కనిపిస్తోంది. బిజెపి తనంత తానుగా టిడిపితో తెగదెంపులు చేసుకునే పరిస్థితి లేదు.

కానీ, బిజెపి, టిడిపిలు పరస్పరం నిందలు వేసుకునేందుకు మాత్రం వెనకాడడం లేదు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే మేమూ రాజీనామా చేసి పోటీ చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా, ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు రెండు నాలుకలు ధోరణిని కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి కూడా కాస్తా ఘాటుగానే మాట్లాడారు.

రాష్ట్రంలో చాలా కాలంగా బిజెపికి, టిడిపికి మధ్య సమరం సాగుతూ వస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో దాని స్థాయి పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని లక్ష్యం చేసుకోవడానికి కూడా వెనకాడకపోవడం టిడిపిలో వచ్చిన తాజా మార్పు. మొత్తం మీద, చంద్రబాబు తనపై పెరుగుతున్న ఒత్తిడిని బిజెపి వైపు మళ్లించే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే, ఆగస్టు 2వ తేదీన జగన్ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ బంద్‌కు కాంగ్రెసు పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. మొత్తం మీద, రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+