కేంద్రం వర్సెస్ ఏపి : రంగంలోకి ప్రధాని : అసలు కధ మొదలైనట్లేనా..!
తెలంగాణ ఎన్నికలు ముగియటంతో ఇక ఏపి రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఇప్పటి వరకు కేంద్రాన్ని..ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని టిడిపి పార్టీతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ఏపిని కేంద్రం మోసం చేసందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఐటి దాడులతో భయపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శిస్తున్నారు. ఇప్పటి దాకా మౌనంగా ఉంటూ..కేవలం రాష్ట్ర స్థాయి నేతలే టిడిపి పై ప్రతి విమర్శలు చేస్తున్నారు. కేంద్రం పై ఏపి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు..కేంద్రం చేసిన సాయం వివరించేందుకు స్వయంగా ప్రధాని మోదీ రంగం లోకి దిగుతున్నారు. ఏపి కేంద్రంగానే ప్రజలకు సమాధానం చెబుతూ..టిడిపికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు..
ప్రధాని మోదీ ఏపిలో పర్యటన కు రంగం సిద్దమైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ గా భావిస్తు న్న ఎన్నికలు ముగియటంతో..ఇక ఏపి పై దృష్టి పెట్టాలని బిజెపి జాతీయ నేతలు నిర్ణయించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన తరువాత ప్రధాని మోదీ..బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకు ఏపికి కేంద్రం సాయం చేయటం లేదని..అన్యాయం చేసిందని టిడిపి ఆరోపిస్తోంది. రాజకీయంగా నూ ఏపిలో బిజెపి పూర్తిగా డామేజ్ చేస్తోందని బిజెపి నేతల వాదన. దీంతో..ఇప్పటి వరకు కన్నా లక్ష్మీనారాయణ..జిబిఎల్ లాంటి వారు మాత్రమే టిడిపి పై ఎదురు దాడి చేస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలపటం.. కేంద్ర ప్రభుత్వ తీరు పై ప్రతీ చోట విమర్శించటాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి సమాధానంగా తామే రంగంలోకి దిగాలని నిర్ణయించారు. అందులో బాగంగా...ప్రధాని మోదీ ఏపిలో పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఏపి ప్రభుత్వం తరపున అధికారికంగా ఆహ్వానం అందే పరిస్థితి లేకపోవటంతో..ఏపిలో పార్టీ బహిరంగ సభల ను ఏర్పాటు చేసి..ఆ సభల ద్వారా టిడిపి ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారు.
ఇందులో భాగంగా.. జనవరి లో ప్రధాని మోదీ..ఆ తరువాత అమిత్ షా సభలు ఏపిలో ఏర్పాటు చేయనున్నారు. తొలుత ప్రధాని సభను జనవరి 6న తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేయాలని దాదాపు నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్ని కల తరువాత ఏపిలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని అటు అధికారంలో ఉన్న టిడిపి నేత లతో పాటుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, ఏపిలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగా..తాము ఏపికి ఏం చేసామనే అంశాలతో పాటుగా చంద్రబాబు ఎందుకు రాజకీయంగా తమను లక్ష్యంగా చేసుకున్నారనే విషయాన్ని వివరించాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. టిడిపి ప్రచారానికి ధీటుగా సమాధానం చెప్పకపోతే..ఏపిలోనే కాకుండా..జాతీయ స్థాయి లోనూ డామేజ్ అవుతామని బిజెపి నేతలు అంచనాకు వచ్చారు. మరి.. ఈ సభల ద్వారా ఏపికి పెండింగ్ హామీల పై ప్రధాని నిర్ణయం ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడలి. అయితే, బిజెపి అగ్ర నేతల సభల ద్వారా ఏపిలో రాజకీయం మరింత వేడెక్కటం ఖాయంగా కనిపిస్తోంది.