తిరుపతి ఘటనపై మోడీ దిగ్భ్రాంతి; తొక్కిసలాటకు కారణం చెప్పిన టీటీడీ ఛైర్మన్
తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇలా జరగడం బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తొక్కిసలాట జరగడానికి కారణం అదే
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తోపులాటపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. తిరుపతిలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారని, ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం చెప్పారని వెల్లడించారు.

టోకెన్లు జారీ చేసే ఒక సెంటర్లో డీఎస్పీ గేట్లు తెరిచారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మొత్తం ఆరుగురు భక్తులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటి వరకు మృతుల్లో ఒకరిని మాత్రమే గుర్తించామని చెప్పారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం తిరుపతికి వస్తున్నారని బీఆర్ నాయుడు తెలిపారు. మృతుల కుటుంబాలకు గురువారం పరిహారం ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
తిరుపతిలో తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. వారందర్నీ రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రీనివాసం వద్ద తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు. బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని రుయా ఆస్పత్రికి తరలించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు.
తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. తిరుపతిలోని ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా గురువారం ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే, టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు.












Click it and Unblock the Notifications