ఏపీ-హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త- ప్రైవేటు బస్సుల రాకపోకలు షురూ...
కరోనా ప్రభావం మొదలయ్యాక దేశవ్యాప్తంగా రవాణా నిలిచిపోవడంతో ఏపీ-తెలంగాణ మధ్య కూడా బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కేంద్రం అన్లాక్ ప్రక్రియ ప్రారంభించినా, అంతర్ రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తేసినా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటివరకూ ఆర్టీసీ బస్సులు నడపలేకపోతున్నాయి. హైదరాబాద్కు బస్సులు నడిపే విషయంలో ప్రభుత్వాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో కేంద్రం విడుదల చేసిన తాజా అన్లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Recommended Video
ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో జనం కార్లు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా వీరు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్కు ప్రైవేటు బస్సులను అనుమతించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆపరేటర్లు రాకపోకలు ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ నుంచి హైదరాబాద్కు 150 సర్వీసులు నడుపుతున్నట్లు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు చెబుతున్నారు.
కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల స్పందన ఆధారంగా త్వరలో సర్వీసుల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది.