ఈసీ ఆదేశాల ఎఫెక్ట్-ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామాల పర్వం..!
ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం 2.67 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వీరంతా ఐదేళ్లుగా పించన్లను ఇంటింటికీ పంపిణీ చేయడంతో పాటు వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక, పథకాలను పంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో వీరి సేవల్ని వాడుకోవాలని వైసీపీ భావించింది. కానీ విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసీ కొరడా ఝళిపించింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లను ఈసీ సస్పెండ్ చేస్తూనే ఉంది. అయినా ఇంకా ఎన్నో చోట్ల వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియతో పాటు ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాల పంపిణీకీ దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్ధ హైకోర్టును ఆశ్రయించడంతో, ఆ మేరకు ఈసీకి ఆదేశాలు రావడం, ఆ తర్వాత పింఛన్ల పంపిణీకి, రేషన్ పంపిణీకి వాలంటీర్లను వాడొద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాలంటీర్లు చేసేది లేక రాజీనామాల బాట పట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు రెండు రోజులుగా మూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్నారు. ఈసీ ఆదేశాలు రాకముందు కూడా వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగినా అది పదుల సంఖ్యలో మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఈసీ ఉత్తర్వుల తర్వాత అది వందల సంఖ్యలోకి చేరింది. ఇదే పరిస్దితి కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ వాలంటీర్లు రాజీనామాలు చేసేసి నేరుగా వైసీపీ ప్రచారంలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వాస్తవానికి విపక్షాలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. ఎలాగో వైసీపీకి మద్దతుగా ఉంటున్న వారు ముసుగు తీసేసి ఆ పార్టీలో చేరిపోవాలనే కోరుతున్నాయి. ఇందుకు తగినట్లుగానే వారు కూడా బహిరంగంగానే టీడీపీ, జనసేన నేతలపై విమర్శలకు దిగుతున్నారు. తమను ట్రోల్ చేస్తున్నారని, అందుకే మనస్తాపంతో రాజీనామాలు చేస్తున్నామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications