నన్ను లాగొద్దు- తెగేసి చెప్పిన అల్లు అరవింద్
Allu Aravind: ఎగ్జిబిటర్లు ప్రతిపాదించిన థియేటర్ల బంద్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, కమల్ హాసన్- మణిరత్నం కాంబోలోని హైబడ్జెట్ మూవీ థగ్స్ లైఫ్ సినిమాలు విడుదల కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు బంద్ కు పిలుపునివ్వడం వివాదాస్పదమైంది.
దీనిపై ఇప్పటికే పవన్ కల్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడానికి ప్రయత్నిస్తోన్న పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఎగ్జిబిటర్ల బంద్ వెనుక ఆ నలుగురి హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణకూ ఆదేశించారు.

ఈ ఎగ్జిబిటర్ల బంద్ వ్యవహారాలపై ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్పందించారు. మంత్రి చెప్పిన ఆ నలుగురికి, తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ నలుగురురిలో తాను లేననీ స్పష్టం చేశారు. ఆ నలుగురు వ్యాపారం నుంచి తాను ఇప్పటికే బయటకు వచ్చేశానని పేర్కొన్నారు.
తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదని, ఏపీలో కూడా అందుబాటులో ఉన్నవన్నీ వదిలేస్తూ వచ్చానని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. ఏపీలో 1,500 థియేటర్లు ఉంటే ప్రస్తుతం తన ఆధీనంలో కనీసం 15 కూడా లేవని పేర్కొన్నారు. ఒకవేళ తన ఆధీనంలో ఏవైనా థియేటర్లు లీజ్ ఉంటే.. వాటిని రెన్యూవల్ కూడా చేయొద్దని స్వయంగా తానే చెప్పానని వివరించారు.
ఆ నలుగురిలో తనను మాత్రం కలపవద్దని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. 50 సంవత్సరాలుగా సినిమాలు తీయడమే తన వృత్తి అని, ఈ క్రమంలో ఎన్నో కష్టనష్టాలను కూడా చవి చూశానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు ఆదరించేలా, మెచ్చుకునేలా సినిమాలను తీయగలుగుతున్నానని, వారి ఆశీర్వాదం వల్లే ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల కాబోతోన్న ప్రస్తుత తరుణంలో థియేటర్లను మూసివేస్తామంటూ ఎగ్జిబిటర్లు ప్రకటించడం అనేది దుస్సాహసమేనని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి తనవంతుగా ఎంతో హెల్ప్ చేస్తోన్నారని పేర్కొన్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెళ్లి అక్కడి పెద్దలను కలవాల్సి ఉన్నా ఫిల్మ్ ఛాంబర్ ఆ పని చేయలేదని అల్లు అరవింద్ అన్నారు. ఛాంబర్ నుంచి ఎవరూ వెళ్లలేదని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ చెప్పినా కూడా ఎవరూ వెళ్లి కలవలేదని, ఇది సహేతుకం కాదని పేర్కొన్నారు.
ప్రభుత్వం సహకారం లేకుండా ఏదీ సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు. ఇండస్ట్రీకి కష్టం వచ్చిందనే కారణంతో గతంలో ఏపీ ముఖ్యమంత్రిని వెళ్లి కలిశారు కదా అని అన్నారు. ఇండస్ట్రీ నుంచి తనను ఎవరూ కలవడానికి రావొద్దంటూ పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన సమర్థనీయమని అల్లు అరవింద్ చెప్పారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ముందుకు రావాలని అన్నారు.












Click it and Unblock the Notifications