'వైఎస్ కు సాధ్యమైన ఆ పని, చంద్రబాబుతో ఎందుకు కావట్లేదు..?'
ఒంగోలు : ప్రత్యేక హోదా విషయంలో అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజాసంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకి మేథావి వర్గం నుంచి కూడా విమర్శలు తప్పట్లేదు. తాజాగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రత్యేక హోదాపై స్పందిస్తూ, చంద్రబాబు పనితీరును తప్పుబట్టారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతోందని నిలదీశారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో హామి ఇచ్చిన బీజేపీ ఇప్పుడు ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
ఇక రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా, గోదావరి గ్యాస్ నిలువలపై కూడా స్పందించిన నాగేశ్వర్, చంద్రబాబు పనితీరును దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనితీరుతో పోల్చుతూ.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోకృష్ణా, గోదావరి గ్యాస్ నిలువల్లో రాష్ట్రానికి 50 శాతం రాయల్టీ ఇవ్వాలని పట్టుబట్టారని, ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు.
అయితే ఇప్పటి సీఎం చంద్రబాబుకు మాత్రం అలాంటి ఉద్దేశమేది లేనట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం గ్యాస్ నిలువలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రాయల్టీ విషయంలో కేంద్రంపైఒత్తిడి తీసుకురాకుండా మౌనంగా వ్యవహరించడమేంటని విమర్శించారు. ఏపీకి 'ప్రత్యేక హోదా రాష్ట్ర-అభివృద్ది' అంశంపై అఖిల భారత అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో నాగేశ్వర్ చంద్రబాబుపై ఈ ఆరోపణలు చేశారు.