guntur gang rape : పురోగతి- పోలీసుల కస్టడీలోనే నిందితులు ? గుర్తించిన యువతి
గుంటూరు జిల్లా సీతానగరంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు ఏపీ పోలీసులకు సవాల్గా మారింది. సీఎం నివాసానికి దగ్గర్లోనే ఈ ఘటన జరగడంపై విపక్షాలు ఇప్పటికే విమర్శలకు దిగుతున్నాయి. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో బాధితురాలు నిందితుల్ని గుర్తించింది. అయితే వీరిని ఇప్పటికే గుంటూరు పోలీసులు తాజాగా ఓ కేసులో అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
సీతానగరం గ్యాంగ్ రేప్ కేసు కొలిక్కి
ప్రకాశం బ్యారేజీకి అతి సమీపంలో సీతానగరం వద్ద గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతిపై తన కాబోయే భర్త ముందే దారుణంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు గుర్తించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలికి రెండు రోజులుగా పోలీసులు పలువురు అనుమానితుల ఫొటోలు పంపుతున్నారు. ఇందులో సీతానగరంకి చెందిన కృష్ణ, వెంకటేష్ అనే ఇద్దరిని బాధితురాలు గుర్తించింది. దీంతో వీరిని గ్యాంగ్ రేప్కు పాల్పడిన నిందితులుగా తేల్చారు.
సినీ ఫక్కీలో పోలీసులకు చిక్కి
సీతానగరంలో ఆదివారం బాధితురాలిపై రేప్కు పాల్పడి, ఆమె కాబోయే భర్తపై దారుణంగా దాడి చేసిన నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు గురించి అప్పటికి పోలీసులకు సమాచారం లేకపోవడంతో ఇతరత్రా కేసుల్లో వారిని నిందితులుగా గుర్తించి విచారిస్తున్నారు. ఇప్పుడు వీరినే నిందితులుగా బాధితురాలు గుర్తించడంతో పోలీసులు అవాక్కైనట్లు తెలుస్తోంది. అంటే నిందితుల్ని కస్టడీలోనే ఉంచుకుని పోలీసులు ఊరంతా గాలించినట్లు సమాచారం.
నిందితుల నేరచరిత్ర ఇదీ
సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా గుర్తించిన కృష్ణ, వెంకటేష్ ఫొటోలు పోలీసులు విడుదల చేశారు. వీరి నేరచరిత్ర గురించి ఆరా తీస్తే దిగ్భ్రాంతి కలిగే వాస్తవాలు బయటికొస్తున్నాయి. గతంలోనూ గంజాయి సేవించి ఆ మత్తులో యువ జంటల్ని లక్ష్యంగా చేసుకుని వీరు అకృత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా కృష్ణానది ఇసుకతిన్నెలు, పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులు చేసి వారి వద్ద నుంచి సొమ్ములు దోచుకున్నట్లు నిర్ధారించారు. తాజాగా సీతానగరం కేసులోనూ బాధితురాలి నుంచి లాక్కున్న ఫోన్ను దాస్ అనే వ్యక్తి వద్ద వీరు తాకట్టు పెట్టినట్లు తెలిసింది.
48 గంటల్లో తేలిన కేసు
సీతానగరం గ్యాంగ్ రేప్ సీఎం జగన్ నివాసానికి కిలోమీటరున్నర దూరంలోనే జరగడంతో గుంటూరు పోలీసుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అటు ప్రభుత్వం నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ కేసును సవాల్గా తీసుకుని ఆరు బృందాల సాయంతో తీవ్ర గాలింపు చేపట్టారు. ఏ ఒక్క ఆధారాన్నీ వదిలిపెట్టకుండా గాలించారు. చివరికి గంజాయి ముఠాలు, పాత నేరస్తుల సాయంతో నిందితుల్ని గుర్తించి బాధితురాలికి ఫొటోలు చూపించగలిగారు. చివరికి కేసులో పురోగతి సాధించగలిగారు. ఇప్పుడు వారి అకృత్యాన్ని నిరూపించగలిగితే ఈ కేసును త్వరలో పూర్తిగా కొలిక్కి తీసుకురావచ్చు.