ప్రముఖ దళిత రచయిత చిలుకూరి దేవపుత్ర కన్నుమూత
అనంతపురం: ప్రముఖ దళిత రచయిత చిలుకూరి దేవపుత్ర కన్నుమూశారు. గుండె పోటు కారణంగా ఆయన మంగళవారం ఉదయం మరణించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన చిలుకూరి దేవపుత్ర దళితుల జీవితాలనే కాకుండా కరువు, ఫ్యాక్షనిజం వంటి వస్తువులతో రాయలసీమ ప్రజల జీవితాలను తన రచనల్లో చిత్రించారు.
ఆయన 1952 ఏప్రిల్ 24వ తేదీన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాల్వపల్లె గ్రామంలో జన్మించారు. తల్లి సోజనమ్మ, తండ్రి ఆశీర్వాదం. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన దేవుపుత్ర 12వ తరగతి చదువుకున్నారు. తర్వాత 1983లో జైళ్ల శాఖలో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటీ తహసీల్దారుగా పదవీ విరమణ చేశారు.

ఆయన అద్దంలో చందమామ, పంచమం, చీకటి పూలు, కక్షశిల అనే నవలలు రాశారు. వంకర టింకర ఓ, ఆరు గ్లాసులు ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ వంటి కథా సంకలనాలను వెలువరించారు. ఆయనను పలు అవార్డులు వరించాయి.
1990లో ఆరు గ్లాసుల పుస్తకానికి నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం లభించింది. 1996లో ఏకాకి నౌక చప్పుడు కథల సంపుటికి హిమబిందు అవార్డు లభించింది. 2000లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం లభించింది. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం లభించింది.
చిలుకూరి దేవపుత్ర మృతికి తెలుగు సాహితీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అంత్యక్రియలు బుధవారం ఉదయం 9 గంటలకు జరుగుతాయి.












Click it and Unblock the Notifications