రాయలసీమ దశ మార్చే ప్లాన్.. కేంద్రం ముందు కొత్త రైల్వే లైన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చే ఏ చిన్న సహాయాన్ని వదలటం లేదు. ఇదే క్రమంలో ముఖ్యంగా రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో వెనక్కు తగ్గటం లేదు. తాజాగా రాయలసీమ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచేందుకు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా ముదిగుబ్బ వరకు సాగే ఈ మార్గానికి సుమారు రూ.2,505 కోట్లు అంచనా వేశారు.
పుట్టపర్తి మీదుగా బెంగళూరుకు సులభమైన కనెక్టివిటీ
ఈ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి మీదుగా బెంగళూరుకు సులభమైన కనెక్టివిటీ ఏర్పడనుంది. వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలను కలిపే ఈ లైన్ ప్రతిపాదనలు ఇప్పటికే సర్వే పూర్తి చేసుకుని, డీపీఆర్ దశలో కేంద్ర రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నాయి. పూర్తయితే ఈ రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దశాబ్దాలుగా రైలు సదుపాయం కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాలకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకంగా రైల్వే లైన్
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఈ రైల్వే లైన్ కీలకంగా మారుతుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు బెంగళూరుకు త్వరగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించగలుగుతారు. ఈ రైల్వే లైన్ ప్రయాణ ఖర్చు తగ్గించటమే కాదు, త్వరగా బెంగుళూరుకు చేర్చి, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు రైలు సౌకర్యం మెరుగవడంతో పర్యాటకం పెరుగుతుంది.
రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానంగా కొత్త ప్రాజెక్ట్
స్థానిక హోటళ్లు, రవాణా రంగాలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అరటి, మామిడి, బత్తాయి వంటి పండ్లు, గ్రానైట్, సిమెంట్ వంటి పరిశ్రమల ఉత్పత్తుల రవాణా ఖర్చు తగ్గి రైతులు, వ్యాపారులకు ఆర్థిక లాభం చేకూరుతుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానంగా ఉండటం వలన ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.
కొత్త రైల్వే లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాయలసీమకు కొత్త కళ
ఈ ప్రాజెక్టులో కొత్త స్టేషన్లు, వంతెనలు, విద్యుద్దీకరణ, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు ఉంటాయి. కేంద్రం నిధులు కేటాయిస్తే, కొత్త రైల్వే లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే,, రాష్ట్రం భూసేకరణలో సహకరిస్తే పనులు వేగంగా జరుగుతాయి. ఈ లైన్ రాయలసీమ అభివృద్ధికి కీలకంగా మారి, ప్రాంతీయ సమతుల్యతకు దోహదపడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications