జగన్ గుడివాడ పర్యటన- చివరి నిమిషంలో వాయిదా
మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన కృష్ణాజిల్లా పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడింది. టిడ్కో గృహాల పట్టాలను లబ్దిదారులకు అందజేయడానికి ఆయన గుడివాడలో పర్యటించాల్సి ఉంది. మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడం వల్ల అందరి దృష్టీ ఈ కార్యక్రమం మీదే నిలిచింది. జగన్ పర్యటనను కొడాలి నాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.
గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాన్ని జగన్ ప్రారంభించాల్సి ఉంది. మొత్తం 8,912 ఇళ్లతో కూడిన టిడ్కో కాలనీ అది. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. దీనికోసం నాలుగైదు రోజుల నుంచి ఏర్పాట్లు కొనసాగించారు అధికారులు. జిల్లాకు చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

గుడివాడ పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ షెడ్యూల్ను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మల్లాయపాలెం చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారని సీఎంఓ తెలిపింది.
అనూహ్యంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీన షెడ్యూల్ చేశారు. జగన్ పర్యటన వాయిదా పడటానికి కారణాలు తెలియరావట్లేదు గానీ ఆయన కొన్ని కీలక శాఖల సమీక్షలో పాల్గొనాల్సి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 12వ తేదీన పల్నాడు జిల్లాలోని క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాల్సి ఉన్నందున.. తొలుత దీనికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నారని సమాచారం.












Click it and Unblock the Notifications