కరోనాకు వైద్యం చేయిస్తానని తీసుకెళ్ళి మైనర్ బాలికతో వ్యభిచారం; గుంటూరు జిల్లాలో దారుణ ఘటన
మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం కనుమరుగైపోతుంది. రాక్షసత్వం పెరిగిపోతుంది. ఎప్పుడు ఎవరు ఎవర్ని ఎలా మోసం చేస్తారు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరి జీవితాలు ఎలా బుగ్గిపాలు అవుతాయో తెలియని పరిస్థితి సమాజంలో ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో భార్య మృతితో తీవ్ర ఆవేదనతో ఉన్న ఓ భర్తను, తల్లి మృతితో తీవ్ర ఆవేదనలో ఉన్న కుమార్తె పరిస్థితిని చూసి సహాయం చేస్తా అంటూ నమ్మబలికిన ఓ మహిళ చేసిన మోసం షాక్ కు గురి చేస్తుంది.
నర్సునని నమ్మించి కరోనా వైద్యం కోసం బాలికను తీసుకెళ్ళిన మహిళ
తాను నర్సును అని చెప్పి, కరోనాతో బాధపడుతున్న మైనర్ బాలికను తీసుకు వెళ్లి వ్యభిచార రొంపిలోకి దింపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే భార్య, కుమార్తె కు కరోనా మహమ్మారి సోకడంతో గుంటూరు జిజిహెచ్ లో చేర్పించాడు ఓ భర్త. కరోనా మహమ్మారికి ఈ సంవత్సరం జూన్ నెలలో భార్య బలైపోగా, కుమార్తెతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు భర్త. ఇక ఇదే అదునుగా చూసుకున్న గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఓ మహిళ వారికి సహాయం చేస్తానంటూ వచ్చింది. తాను ఆస్పత్రిలో నర్సునని వారిని నమ్మించింది.
బాలికను పలు ప్రాంతాలు తిప్పుతూ వ్యభిచారం
బాలిక ప్రాణాలు కాపాడడానికి నాటువైద్యం చేయించాలని, తాను బాలికను తీసుకు వెళతాను అంటూ తండ్రిని ఒప్పించింది. ఇక వైద్యం పేరుతో బాలికను తీసుకు వెళ్లి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో బాలిక తోటి వ్యభిచారం చేయించింది. పల్నాడులో ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను కరోనా వైద్యం పేరుతో తీసుకు వెళ్లిన సదరు మహిళ వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయడంతో తనకు ఆ పని చేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి, బయటకు రానీయకుండా కొన్నాళ్లు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడ కి తీసుకువెళ్లి వ్యభిచారం చేయించింది సదరు మహిళ.
బాలిక అనారోగ్యం .. బాలికను వదిలేసిన మహిళ
వైద్యం చేయించి తీసుకొస్తానని మహిళ చెప్పి తీసుకువెళ్లిన తన కుమార్తె ఎంతకీ తిరిగి రాకపోవడంతో రెండు నెలల క్రితం తండ్రి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇటీవల బాలిక అనారోగ్యం పాలు కాగా, బాలికను విజయవాడలో వదిలివేయడంతో తండ్రి ఫిర్యాదు మేరకు గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసి కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తండ్రి పాత్రపైనా అనుమానం .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బాలికను తీసుకెళ్లిన మహిళ నర్సు కాదని వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు అని పోలీసులు చెబుతున్నారు. అయితే బాలికను మహిళకు అప్పగించి పంపించిన తండ్రి పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని మహిళకు బాలికను అప్పగించి పంపించిన తండ్రి వ్యభిచార కేంద్రం నిర్వాహకులతో ఏదైనా ఒప్పందం చేసుకున్నారేమో అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక పూర్తిగా కోలుకున్న తరువాత ఈ కేసును పూర్తిస్థాయిలో విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.