స్థానిక ఎన్నికల్లో అసెంబ్లీ రౌడీ సీన్:అలా చేస్తే..రెడ్డి కులంలోకి మారుతాం:రాజధాని రైతుల కొత్త నినాదం
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రోజుకో కొత్త అంశానికి వేదిక అవుతున్నాయి. ఏకపక్ష విజయం కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఇదే సమయంలో బీజేపీ..జనసేన సైతం కొత్త ఆశలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే, దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అమరావతి నుండి రాజధాని తరలింపు.. అక్కడి స్థానికుల ఆందోళన అంశాల నుండి అధికార పక్ష వ్యూహంతో ఇతర పక్షాలు సైతం సైడ్ ట్రాక్ పట్టాయి. అయినా..అమరావతి ప్రాంత రైతులు...స్థానికులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. చివరకు అక్కడ ప్రజలు రాష్ట్ర ప్రజలకు కొత్త పిలుపు ఇచ్చారు. ఇదే సమయంలో రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయండి మీ రెడ్డి కులంలోకో, లేదా మీరు సూచించిన కులానికో మారుతామంటూ రైతులు నినదించటం ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది.
అసెంబ్లీ రౌడీ తరహాలో ఇలా చేయండి...
అమరావతి నుండి రాజధాని తరలింపు వ్యవహారం పైన స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు లేకపోయినా...రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో తమకు మద్దతుగా ఇతర ప్రజలు ఏ రకంగా మద్దతివ్వాలో సూచిస్తూ కొత్త అంశం తెర మీదకు తీసుకొచ్చారు. రాజధాని విషయంలో మన నిర్ణయాన్ని చెప్పుకొనేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే బలమైన ఆయుధం అని వివిరస్తూ.. ఓటు వేసే ప్రతి ఒక్కరూ మీ ఓటుతో పాటు జై అమరావతి అని రాసి ఉన్న స్లిప్ని పెట్టి బ్యాలెట్ బాక్స్లో వేయండని అభ్యర్ధించారు.
ఎన్నికల్లో అవకాశం లేకుండా చేశారు
రాజధాని అమరావతిని కాపాడండంటూ రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు రాజధాని రైతులు, రైతు కూలీలు పిలుపునిచ్చారు. ఈ మేరకు తుళ్లూరులో రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ ఓటు హక్కును హరించారని... రాజధాని గ్రామాల్లో ఎన్నికలు పెట్టి ఉంటే ఇలానే చేసేవాళ్లమని చెబుతూ..తమకు అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో యావత్ రాష్ట్ర ప్రజలు అమరావతికి అండగా నిలవాలని కోరుతున్నామంటూ పిలుపునిచ్చారు.
ఎన్నికల తర్వాత రాజధాని తరలింపు వేగవంతం
అమరావతిలో రాజధాని ఏర్పాటు సమయం నుండి తాజాగా రాజధాని మార్పు అంశం వరకు అక్కడ ఒకే వర్గానికి గత ప్రభుత్వం మేలు చేసేందుకు ప్రయత్నించిదనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అక్కడ కేవలం కమ్మ వర్గానికి చెందిన వారే కాదని..అన్ని వర్గాలు ఉన్నాయంటూ స్థానికుల నుండి టీడీపీ అధినేత చంద్రబాబు వరకు అందరూ వివరణ ఇచ్చారు. అయితే, ఇప్పుడు స్థానికులు ఇక తాజా ఎన్నిక ల తరువాత ప్రభుత్వం రాజధాని తరలింపు వ్యవహారం వేగవంతం చేసే అవకాశం ఉందనే అంచనాలో ఉన్నారు. దీంతో..వారు అనూహ్య ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు.
Recommended Video
అలా చేస్తే..రెడ్డి కులంలోకి మారుతాం..
తమ ప్రాంతం నుండి రాజధానిని తర లించకుండా.. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయండి మీ రెడ్డి కులంలోకో, లేదా మీరు సూచించిన కులానికో మారుతామంటూ తాజా నిరసనల్లో రైతులు నినదించారు. తమకు కులం ముఖ్యం కాదని.. తమ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీని ద్వారా ప్రధానంగా అమరావతి పరిధిలోని రెండు జిల్లాల్లో కమ్మ వర్గం ప్రజల తీర్పు ఈ స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. రైతులు తాజాగా తాము సైతం రెడ్లుగా మారేందుకు సిద్దమని చేసిన ప్రతిపాదన పైన స్థానిక గ్రామాల్లో చర్చకు కారణమైంది.