కౌలు రైతులకు పంట రుణాలు కష్టమేనా .. జగన్ సర్కార్ నిర్ణయానికి బ్యాంకర్లు ఏమంటున్నారు ?
Recommended Video
కౌలు రైతుల కష్టాలు తీర్చాలని కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని సూచించింది ఏపీ లోని జగన్ సర్కార్. అయితే కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉన్నా బ్యాంకర్లు మాత్రం అందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానికి కారణాలు లేకపోలేదు. కౌలు రైతులకు భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం అందులో భాగంగా అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారికి ఎలిజిబిలిటీ కార్డులు అందిస్తుంది. ఎవరైతే లోను ఎలిజిబిలిటీ కార్డులు తీసుకున్నారో వారందరికీ బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు మాత్రం ఆసక్తి చూపించడం లేదు.
ప్రజాధనం వినియోగంలో ఇంగితజ్ఞానం లేదు.. అంతా రాచరికంలా మారిందన్న జేపీ
కౌలు రైతులకు బ్యాంక్ రుణాలు ఇవ్వాలని సూచించినా స్పందించని బ్యాంకర్లు
కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్న బ్యాంకర్లు మాత్రం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు .ఎందుకంటే రికవరీకి సంబంధించి చట్టపరమైన మరియు సాంకేతిక కారణాలు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై బ్యాంకర్లు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు ఒక కడప జిల్లా తీసుకుంటే కడప జిల్లాలో 2017- 18 సంవత్సరానికి 1800 మంది రైతులకు ప్రభుత్వం లోను ఎలిజిబిలిటీ కార్డులు జారీ చేసినప్పటికీ 554 మంది రైతులు మాత్రమే బ్యాంకుల నుండి పంట రుణాలు పొందారని తెలుస్తుంది. జిల్లాలో 15 వేల మంది కౌలు రైతులు వరి ఉద్యానవన సాగు నిర్వహిస్తున్న కేవలం 554 మంది రైతులకు మాత్రమే గత సంవత్సరం బ్యాంకులు రుణాలిచ్చాయి.
భూయజమానుల సహకారం లేక రుణాలు తీసుకోవటంలో కౌలు రైతులకు ఇబ్బందులు
కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో భూ యజమానులు కౌలుదారు రైతుల రుణాలకు సంబంధించిన ఫారం పై తమ అంగీకారం తెలుపుతూ సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ భూ యజమానులు అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చినంత మాత్రాన అది ఈ వారి భూములపై హక్కులను ఏ విధంగా ప్రభావితం చేయదని ప్రభుత్వం చెప్పినప్పటికీ కౌలు రైతులకు భూయజమానులు సహకరించటం లేదు. కౌలు రైతులు బ్యాంకు రుణ సదుపాయం పొందడం వల్ల తమ భూముల పై హక్కు వస్తుందేమో అన్న భయం లో భూ యజమానులు బ్యాంకు లోన్ లు ఇచ్చేందుకు తమ అంగీకారం తెలుపుతూ సంతకం చేసి కౌలు రైతులకు సహకరించడం లేదు.
చట్టపరమైన, సాంకేతిక కారణాలతో రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంకర్లు ..ప్రభుత్వ చొరవ అవసరం
ఇక బ్యాంకర్లు రుణాలను తిరిగి వసూలు చేసే క్రమంలో సాంకేతికమైన చట్టపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో భూ యజమానులు అంగీకారం లేకుండా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతుల కష్టాలు తీర్చాలని, భూ యజమానులతో సమానంగా వారికి కూడా పంట రుణాలు అందించాలని, కౌలు రైతులకు కూడా రైతులకు అందించే సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయాలని భావిస్తున్న ప్రభుత్వ ఆశయం నీరుకారిపోతుంది అనే భావన కలుగుతుంది. ఏది ఏమైనా కౌలు రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలని సంకల్పించినా ఇందులో తలెత్తిన సాంకేతిక, చట్ట పరమైన ఇబ్బందులను అర్థం చేసుకొని ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోకుంటే ఈ ఖరీఫ్ సీజన్లో నూ రైతులకు పంట రుణాలు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇచ్చిన నామమాత్రంగా కొందరికిచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది.
ఏపీలో 32 లక్షల మంది కౌలు రైతులు.. ప్రభుత్వం రుణాల విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి
ఏపీలో ప్రస్తుతం 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఇన్ని లక్షల సంఖ్యలో కౌలు రైతులు ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు కౌలు రైతులకు అందని ద్రాక్షగానే మారిన పరిస్థితి . ప్రస్తుతం కౌలు ధరలు పెరుగుతూనే ఉన్నాయనీ, ఇన్ పుట్ ధరలు, వడ్డీల భారంతో కౌలు రైతులు కుంగిపోతున్నారు. బ్యాంకర్లు పంట రుణాల జారీ సందర్భంగా కూడా కౌలు రైతులను పట్టించుకోకపోవటం రైతులకు తిప్పలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి బ్యాంకర్లతో సమావేశమై కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందించడం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. లేకుంటే కౌలు రైతులకు మిగిలేది కష్టాలు.. కడగండ్లే...