ఇంట్లో వదినని చంపి రోడ్డుపై సైకో వీరంగం, మరో ఇద్దరు మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఇంట్లో సొంత వదినని దారుణంగా హతమార్చి, బస్టాండ్ వద్ద హల్చల్ చేశాడు. రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
కోరుకొండ బస్టాండ్ వద్ద ఉన్మాది రాడ్డుతో, కత్తితో ముగ్గురు నలుగురి పైన దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో వ్యాపారి నాగభూషణం, ఎంపీటీసీ సభ్యురాలు కుమారి ఉన్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని పట్టుకునేందుకు వచ్చారు. వారి పైన కూడా దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు గాయాలయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే అతను ఇంట్లో తన వదిన లలితను హతమార్చి వచ్చాడని గుర్తించారు.
ఆ ఉన్మాది పేరు ఆనంద్ కుమార్ అని తెలుస్తోంది. అతనికి మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. డిఎస్పీ, సీఐ, ఎస్సైలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
రంపచోడవరంలో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. వ్యాపార నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శంకర్కు మాడిమిల్లి రోడ్డులో రెండు బట్టల దుకుణాలు ఉన్నాయి. వ్యాపారం కోసం అప్పు తీసుకున్నాడు.
అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురైన శంకర్ భార్య లక్ష్మీ, కొడుకు వీరబాబులతో సహా పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికులు వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం రాజమండ్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వీరబాబు మృతి చెందాడు.