సైకో సీరియల్ కిల్లర్ అరెస్టు...అత్యంత కిరాతకుడు...ఒంటరిగా దొరికితే ఔటే!
చిత్తూరు: అతి కిరాతకుడైన ఒక సైకో కిల్లర్ ను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి అతడు ఎంత భయంకరుడంటే సైకో కిల్లర్ అనే పదం అతనికి ఏమాత్రం సరిపోదు. అతని పైశాచికత్వం వర్ణించడానికి ఎన్ని పదాలైనా సరిపోవు...
ఒంటరి మహిళ అతని కంటబటిందంటే ఇక ఆమెకి చావు మూడినట్లే. అయితే మామూలుగా ప్రాణాలు తీస్తే పరవాలేదు...అతడు చేసే హత్యలు ఎలా ఉంటాయంటే తలపై బండరాతితో మోది...శరీరం మంతా రక్తం ధారలు గా కారుతుంటే...ఆమె ఆర్తనాదాలు చేస్తూ...గిలా గిలా కొట్టుకుంటూ చనిపోతుంటే అలా చూస్తూ ఎంజాయ్ చేయడం అతనికి చెప్పలేనంత ఇష్టం. ఇలాంటి హత్యా దాడులు కేసులు ఇతనిపై ఒక్క తమిళనాడులోనే 40కి పైగా ఉన్నాయంటే వీడెంత భయంకరుడో అర్థం చేసుకోవచ్చు...అయితేనేమి ఇంతటి అతి వీర భయంకరుడిని చిత్తూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు పట్టేశారు.
సైకో అంటే వీడే...ఎందుకంటే...
ఒంటరి మహిళలు, వృద్ధులే ఆ సైకికోల్లర్ టార్గెట్. ఎవరూ లేని సమయం చూసుకొని అలాంటి మహిళలపై దాడికి తెగబడతాడు. ఆ తరువాత బండరాయితో తలపై మోది వారు చిత్రవధకు గురై చనిపోయేదాకా అక్కడే ఉండి ఆనందంతో గంతులు వేస్తూ తనివి తీరా ఆస్వాదిస్తాడు. ఈ తరహాలో అనేకమంది మహిళలు అత్యంత దారుణ హత్యకు గురవుతూ. అంతు చిక్కని రీతిలో చనిపోతుండటంతో ఈ తరహా కేసులు అనేక సంవత్సరాల పాటు చిత్తూరు జిల్లా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దీంతో ఈ కాలాంతకుడిని ఎలాగైనా పట్టుకోవాలని పట్టువీడకుండా కృషి చేస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులకు కాలం కలసి వచ్చింది. వీడిని పట్టకోవడం కోసమే ప్రత్యే బృందాలను ఏర్పాటు చేసి...ఎంతో శ్రమించి ఎట్టకేలకు ఈ సైకో కిల్లర్ గాడిని పట్టుకున్నారు.
ఎలా పట్టుకున్నారంటే...గ్రేటే
చిత్తూరు జిల్లాలో ఇటీవలి కాలంలో పలువురు మహిళలు ఇలానే కిరాతకంగా హత్య చేయబడ్డారు. కొంతకాలం విరామం తరువాత ఫిభ్రవరి 25న నగరి మండలం వి.కె.ఆర్. పురం వద్ద రత్నమ్మ అనే మహిళను ఎవరో బండరాయితో మోది అతి కిరాతకంగా హత్య చేశారు. అలాగే ఈనెల 9న పాలసముద్రం మండలం గంగమాంబపురం పంచాయితీ, అబ్బిరాజు ఖండ్రిగకు చెందిన చెల్లెమ్మ అనే వృద్దురాలిని ఇదే విధంగా బండరాయితో మోదీ హత్యచేశారు. వీటిపై ప్రాథమికంగా కొన్ని క్లూస్ లభించడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తమిళనాడులో కూడా ఇదే తరహాలో హత్యలు జరుగుతున్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో మరింత లోతుగా విచారణ చేయగా తమిళనాడు రాష్ట్రంలో సీరియల్ సైకో కిల్లర్ మునిస్వామి గురించి తెలిసింది. దీంతో అతడికి సంబంధించిన వివరాలతో తమ వద్ద ఉన్నవాటిని పోలిస్తే ఇవి సరిపోలడంతో అక్కడి పోలీసులు సహాయంతో మునిస్వామిని అదుపులోకి తీసుకున్నారు.
హంతకుడిని చూసి...ఆశ్చర్యపోయిన పోలీసులు...
అయితే ఇంతటి కిరాతంగా హత్యలు చేసే మును స్వామి మరెంత భయంకరంగా ఉంటాడో అని అందరూ భావించగా ఆ సైకో కిల్లర్ ను చూసి పోలీసులు సైతం షాక్ తిన్నారు. పొట్టిగా బక్కపలుచగా అర్భక జీవి లా ఉన్న ఈ 42 ఏళ్ల వ్యక్తి...ఇతడే అంతమందిని అతి కిరాతకంగా చంపాడంటే పోలీసులకే నమ్మశక్యం కాని పరిస్థితి. తమిళనాడు రాష్ట్రంలోని వాలాజీ తాలూకామాన్ తంగాల్ గ్రామానికి చెందిన పంజాక్షరి అనే వ్యక్తి కుమారుడే ఈ సైకో కిల్లర్ మునిస్వామి. వరుస హత్యలతో సంచలనం సృష్టించిన ఈ మునిస్వామిపై అక్కడే 5 హత్య కేసులతో పాటు దోపిడీ వంటి కేసులు సుమారు 40 వరకూ నమోదై ఉన్నాయి. ఇతడి ప్రవర్తన కూడా విచిత్రంగానే ఉండేది...కొందరు మహిళలనే బండరాయితో తలపై మోది అతి కిరాతకంగా చంపేవాడు. అలా హత్యచేసిన మహిళల ఒంటిపై నగలను మాత్రం దొంగిలించేవాడు కాదు. కేవలం వారి హత్య ద్వారా పైశాచిక ఆనందం పొందేందుకే వారిని చంపేవాడు.
సైకో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్...
1992లో మునుస్వామి తన 17 ఏళ్ల వయసు నుంచే చోరీలు, దోపీడిలు లాంటి నేరాలు చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. 2007లో దోపిడీలో భాగంగా మొదటి హత్యకు ప్రయత్నించాడని చెప్పారు. నేరాలకు అలవాటుపడిన అతను శివారు ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా హత్యలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నట్లు తెలిపారు. చిల్లర నగదు, చరవాణి కోసం కూడా హత్యలు చేసే స్థాయికి దిగజారిపోయాడన్నారు. పసివాళ్లను హత్యచేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆయుధాలు కాకుండా హత్యలకు బండరాయినే ఉపయోగించేవాడని చెప్పారు. చాలాకాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు వాలాజా, రాణిపేట, ఆర్కాడు, తిరువళ్లూరు, ఆర్.కె.పేట, వేలూరు, షోలింగర్, తదితర ప్రాంతాల్లో నేరాలు చేశాడని, ఇతనిపై సుమారు 40 కిపైగా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నేరాలు చేసి జైలుకెళ్లడం, విడుదలనంతరం మళ్లీ నేరాలు చేయడం అతనికి అలవాటయ్యాయన్నారు.
ఏమైతేనేం చివరకు...పట్టుబడ్డాడు...
తమిళనాడు రాష్ట్రం,చిత్తూరు జిల్లాలో మహిళల వరుస హత్యల నేపథ్యంలో ఆ కేసును ఛేదించేందుకు డీఎస్పీ, సీఐలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబు చెప్పారు. బృందం అధికారులు వివిధప్రాంతాల్లో గాలింపు చర్యల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో పరిశీలించగా అక్కడా ఇదే తరహా అయిదు హత్యలు చోటుచేసుకోవడంతో ఈ హత్యలన్నింటికీ ఒక్కడే కారణమనే నిర్ణయానికి వచ్చామన్నారు. అక్కడి పోలీసులతో మాట్లాడి ఆ సమయాల్లో జరిగిన హత్యలపై ఆరా తీశామని, ఘటనా స్థలాల్లో లభ్యమైన ఆధారాలను పరిశీలించినట్లు చెప్పారు. అక్కడి ఆధారాలతో పాటు చిత్తూరు జిల్లాలో జరిగిన హత్యా ఘటనల్లో లభ్యమైన వేలిముద్రలను వేలూరు వేలిముద్రల బ్యూరోలో పరిశీలించామని పేర్కొన్నారు. పరిశీలనలో ఇతర నేరాల్లో పట్టుబడిన వేలూరుకు చెందిన మునస్వామి వేలిముద్రలు ఇక్కడి హత్య ఘటనల్లో లభ్యమైన వేలిముద్రలు సరిపోలినట్లు తెలిపారు. దీంతో అతనే హంతకుడని నిర్ధారించి అరెస్ట్ చేశామని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు అతిథి గృహంలో హంతకుణ్ని విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. దీంతో వరుస హత్యలతో రెండు రాష్ట్రాల ప్రజలకు నిద్ర లేకుండా చేసిన సైకో కిల్లర్ అరెస్టు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.