2026 డీలిమిటేషన్లో ఎస్సీ నియోజకవర్గంగా మారుతున్న పులివెందుల?
ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 నియోజకవర్గాలకు 11 నియోజకవర్గాలను గెలుచుకొని కుదేలైంది. ప్రజలు అంత తీవ్రస్థాయిలో తిరస్కరిస్తారని ఊహించలేకపోయామని ఆ పార్టీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఆయన పులివెందుల నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం కంచుకోట. కొన్ని దశాబ్దాలుగా వారి కుటుంబ సభ్యులే పోటీచేస్తున్నారు.. వారే విజయం సాధిస్తున్నారు. అంతగా ఆ నియోజకవర్గంపై ఆ కుటుంబ ముద్ర ఉంది.
బలమైన గ్రామాలను విడదీసి..
ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2006లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పునర్విభజనను ఆయన తమకు అనుకూలంగా మార్చుకున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుగా మార్చారు. మరికొన్నిచోట్ల టీడీపికి బలమైన గ్రామాలు, పట్టణాలను రెండుగా విడదీసి వేర్వేరు నియోజకవర్గాల్లో కలిపారు. 2009లో కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలుపొందడానికి నియోజకవర్గాల పునర్విభజన కూడా ఒక కారణమని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుంటారు.

ఆందోళనలో వైసీపీ
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 26 ప్రకారం ఏపీలోని 175 నియోజకవర్గాలు 225కు, తెలంగాణలోని 119 నియోజకవర్గాలు 153కు పెరగాలి. వీటికి సంబంధించిన పనులు 2026లో జరుగుతాయి. పునర్విభజనవల్ల తీవ్రంగా నష్టపోతామనే ఆందోళన వైసీపీలో నెలకొంది. అసలు పునర్విభజన ప్రక్రియే ఆ పార్టీకి శరాఘాతమని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు ప్రభావితం చేస్తారు
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పునర్విభజన తమకు అనుకూలంగా చేసుకుంటుందని భావిస్తున్నారు. ఎన్డీయేను, పునర్విభజన కమిషన్ ను చంద్రబాబునాయుడు ప్రభావితం చేస్తారని, పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చివుంటే కచ్చితంగా ఆ పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగేదని, కుప్పం నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడుగా చేసేవారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications