పులివెందుల ప్రజల కల నెరవేర్చిన పవన్.. జగన్ కంచుకోట బద్దలయ్యే వ్యూహం!
ఏపీలోని హాట్ సీటైన పులివెందుల నియోజకవర్గంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి రాజకీయ వేదికగా నిలుస్తూ వచ్చిన ఈ కంచుకోటను, కేవలం ప్రచార నినాదాలతో కాకుండా క్షేత్రస్థాయి అభివృద్ధి పనులతో బద్దలుకొట్టాలని కూటమి ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోక ప్రజా ఇబ్బందులకు కారణమైన తాగునీటి సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అడుగులు వేశారు.
పులివెందుల పరిధిలోని ఏడు మండలాల ప్రజలకు తాగునీరు అందించే ఉద్దేశంతో గతంలో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో 'జల్ జీవన్ మిషన్' కింద మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును తలపెట్టారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపు, పనుల పర్యవేక్షణ లోపించి ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది. 2024 నాటికి ఈ ప్రాజెక్టు గడువు కూడా ముగిసిపోవడంతో నిధులు ఖర్చు చేయలేని సంక్షోభం ఏర్పడింది. అయితే పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి జల్ జీవన్ మిషన్ను పొడిగించడంతో ఈ పథకానికి మళ్లీ మోక్షం లభించింది.

రూ. 280 కోట్ల నిధులు.. 96 శాతం పూర్తయిన పనులు!
రాజకీయ కారణాల వల్ల ప్రజల ప్రాథమిక అవసరాలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 280 కోట్ల నిధులను ప్రత్యేకం కేటాయించారు. ఆయన ఆధ్వర్యంలో పనులు శరవేగంగా పుంజుకున్నాయి. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 426 కోట్లు కాగా ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు పనుల్లో 96 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి.
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం
— JanaSena Party (@JanaSenaParty) August 24, 2026
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి
•జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల… pic.twitter.com/WfmWcca39q
1,111 కిలోమీటర్ల పైప్లైన్ లక్ష్యానికి గాను 1,106 కిలోమీటర్ల విస్తరణ పూర్తయింది. 65 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. పులివెందుల టౌన్, పులివెందుల రూరల్, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పనులు పూర్తయి నీరందుతోంది. లింగాల మండలంలో 24 ఆవాసాలకు పంపిణీ సిద్ధమైంది. చెక్రాయపేట, తొండూరు, వేముల, వేంపల్లె మండలాలకు త్వరలోనే నీరందనుంది
ఎన్నికల సమయంలో ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రజా జీవితాల్లో మార్పు తెచ్చే అభివృద్ధి పనులతో ప్రజలకు దగ్గరవ్వాలనే ప్రణాళికతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పులివెందులలో తాగునీటి వంటి మౌలిక సమస్యను తీర్చడం ద్వారా ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. "వైనాట్ పులివెందుల" నినాదం నిజం కావాలంటే సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఆయుధాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.
సోషల్ మీడియా కామెంట్స్
అయితే సోషల్ మీడియాలో పవన్ చేసిన పని గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులకు తండ్రి, కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా తాగడానికి నీళ్లు ఇవ్వని వైనం అంటూ కొందరంటుంటే.. పులివెందుల ప్రజానీకానికి ఎంత చేసినా వారు వైఎస్ ఫ్యామిలీ వైపే ఉంటారని మరికొందరు అంటున్నారు. ఈ సారి పులివెందులలో కూటమి గెలవాల్సిందే అంటూ కూటమి అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
మరి పులివెందుల కోసం ఎవరు ఏం చేస్తే బాగుంటుంది మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.














Click it and Unblock the Notifications