ఎదురు చూస్తున్నా: ప్యాకేజీపై పురంధేశ్వరి, బాబు 9డిమాండ్లు, చర్చల్లో ప్రతిష్టంభన
విజయవాడ: ఏపీని ఆధుకునేందుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి బుధవారం అన్నారు. ఏపీని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని చెప్పారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు తాము ఏపీలోని పరిస్థితిని వివరించామని చెప్పారు. రైల్వే జోన్ ఏపీకి తప్పనిసరిగా వస్తుందన్నారు.
రైల్వే జోన్, ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఎలాంటిదో నాకు కూడా తెలుసునని చెప్పారు. తాము ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకోమని చెప్పారు. ఇచ్చిన హామీలను బీజేపీ కచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పారు. తాము ప్యాకేజీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
మీడియా ప్రజలను పక్కదోవ పట్టించవద్దన్నారు. తాము హోదా అన్న పదాన్ని సాంకేతికంగా వాడలేమన్నారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ వంటి సాయం చేస్తామన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయకముందే దాని గురించి మాట్లాడటం సరికాదన్నారు. ప్రత్యేక హోదా కోసం మేం ఏం ప్రయత్నం చేశామో మాకు తెలుసునని చెప్పారు. కేంద్ర ప్రకటన కోసం చూస్తున్నామన్నారు.
బాబుపై సుబ్బిరామిరెడ్డి ఆశలు, సీఎంను మోడీ చిక్కుల్లోకి నెడుతున్నారా?
ఏపీ బీజేపీ అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్ విశాఖ నుంచి విజయవాడకు తరలించడం ఎట్టి పరిస్థితుల్లోను జరగదని చెప్పారు. ఇప్పుడు వచ్చింది అపోహ మాత్రమే అన్నారు. విశాఖ ఎంపీగా, ఎమ్మెల్యేగా, బీజేపీ నేత పురంధేశ్వరి కూడా ఇక్కడే ఉన్నారని.. మేమంతా కచ్చితంగా చెబుతున్నామన్నారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. రైల్వే జోన్ విశాఖకే వస్తుందని చెప్పారు.
మోడీ ముందు చంద్రబాబు డిమాండ్లు
ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం భోజనానంతరం మరోమారు భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు.
బాబు ఆగ్రహం-వెంకయ్య చక్రం, దిగొచ్చిన మోడీ: ప్యాకేజీ ఇలా!
ఇప్పటిదాకా ముగిసిన భేటీలో కేంద్రం ప్రకటన గురించిన వెలుగులోకి వచ్చిన అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తనను కేంద్ర మంత్రి వెంకయ్య ఢిల్లీకి ఆహ్వానించిన విషయాన్ని వారికి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు నిధులు తదితర 9 అంశాలకు చెందిన డిమాండ్లను కేంద్రం ముందు పెట్టామని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. వీటన్నింటికీ కేంద్రం సానుకూలంగా స్పందిస్తేనే ఢిల్లీకి వెళతానని, లేదంటే వెంకయ్య ఆహ్వానాన్ని సున్నితంగానే తిరస్కరిస్తానని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం రాత్రే కేంద్రానికి కూడా స్పష్టంగా చెప్పానన్నారు.
అంతేకాదు, మనం ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉందామని చంద్రబాబు నేతలతో వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తంది. ప్యాకేజీ వార్తలు కేవలం లీకేజీలేనని ఆయన అన్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, తన ముందు ఏపీ పెట్టిన డిమాండ్లలో ప్రత్యేక హోదా మినహా దాదాపుగా అన్ని డిమాండ్లకు సరేనన్న కేంద్రం... తాజాగా మరో మెలిక పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏపీ ఆర్థిక లోటు భర్తీ విషయంలో తాము న్యాయం చేయలేమంటూ కేంద్రం అశక్తతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం చర్చల్లో ఒక్కసారిగా ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం.