ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి..! మారుతున్న సమీకరణాలు: జగన్..బాబు టార్గెట్ గా..!
ఏపీలో రాజకీయాల పైన బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో కొత్త వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా..ఈ నెల 16న దీని పైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరికి కేంద్ర మాజీ మంత్రిగా, ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా..వివిధ భాషల్లో అనర్గళం గా మాట్లాడగల నేతగా గుర్తింపు ఉంది. పురందేశ్వరి పేరు పైనా చివరి నిమిషంలో ఏమైనా మార్పు జరిగితే ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ నేత..ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సమీకరణాల ద్వారా బీజేపీ వ్యూహం ఏంటనేది స్పష్టం అవుతోంది.
బీజేపీ అధ్యక్ష మార్పు..రేసులో ముగ్గురు
ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవి పైన అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇందు కోసం ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో ఎవరికి ఇవ్వాలనే అంశం పైన మూడు పేర్లను పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తనను అధ్యక్ష పదవిలో కొనసాగించాలని ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థిస్తున్నప్పటికీ..పార్టీ కేంద్ర నేతలు మాత్రం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు..సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయం పైన ఫోకస్ చేసినట్లు సమాచారం.

దీంతో..ఇప్పటి వరకు కాపు వర్గానికి చెందిన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వటంతో..టీడీపీ స్థానాన్ని తాము ఆక్రమించాలని ఉవ్విల్లూరుతున్న బీజేపీ ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన మహిళ అయిన పురంధేశ్వరి పేరు మొదటి స్థానంలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎమ్మెల్సీ మాధవ్ పేరును సైతం బీజేపీ నేతలు పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం.
టార్గెట్ వైసీపీ..టీడీపీ
బీజేపీ అధినాయకత్వం ఏపీలో తమకు ఖచ్చితంగా మంచి స్థానం దొరుకుతుందని అంచనా వేస్తోంది. అందులో భాగంగానే.. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. ఇక, టీడీపీ కి అండగా నిలిచే ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే మరింత ప్రయోజనం ఉంటుదని అంచనా వేస్తోంది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో జగన్ కు అండగా నిలు స్తున్న ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతలతో ఇప్పటికే బీజేపీ టచ్ లో ఉంది.
దీని ద్వారా ఆ వర్గ నేతలకు తమ పార్టీలో ప్రాధాన్యత ఇస్తే సీమ ప్రాంతంలో తాము పోటీ ఇవ్వగలుగుతామని అంచనా వేస్తోంది . ఇక, ఉత్తరాంధ్ర విషయంలోనూ బీజేపీ ఫోకస్ చేస్తోంది. అందు కోసం విశాఖ కేంద్రంగా అక్కడి నుండి బీసీ నేతకు పార్టీ పగ్గాలిచ్చే ఆలోచన సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారినికి ఈ నెల 16న బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications