సోనియా విన్లేదు: పురంధేశ్వరి, పవన్ స్లోగన్పై జవదేకర్
విజయవాడ: సీమాంధ్రకు ప్యాకేజీ కావాలంటే బిజెపికి ఓటు వేయాలని ఆ పార్టీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం అన్నారు. బిజెపి సీమాంధ్ర నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. విభజన బిల్లు సభలో పెట్టినప్పుడు తమను పార్లమెంటులో వెల్లోకి వెళ్లకుండా విభజించిన తీరు చాలా బాధించిందన్నారు.
దాని వల్ల తమ ప్రాంతానికి ఏర్పడే నష్టాన్ని ఎలా తీరుస్తారని అనేకసార్లు అధిష్ఠానాన్ని అడిగినా ఫలితం లేకపోయిందన్నారు. జివోఎం ముందు తాము పెట్టిన ప్రతిపాదనలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విభజన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తెలుగువాడి పౌరుషం చూపాల్సిన అవసరం ఉందన్నారు. విభజన వల్ల తమ ప్రాంతానికి ఏర్పడే నష్టాన్ని తీర్చాలని చాలాసార్లు వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. సమస్యను సోనియాకు చెప్పినా వినిపించుకోలేదన్నారు.
తెలంగాణ బిల్లును ఆమోదిస్తే తాను రాజీనామా చేస్తానని సోనియా గాంధీకి ముందే చెప్పానని తెలిపారు. సీమాంధ్రకు ప్యాకేజీ కోసం వెంకయ్య నాయుడు తీవ్రంగా పోరాడారన్నారు. కాంగ్రెసు పార్టీ పైన ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. తమ పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో బిజెపిని గెలిపించుకోవాలని, బిజెపితోనే సీమాంధ్రకు ప్యాకేజీ వస్తుందని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
బిజెపితోనే సీమాంధ్ర, తెలంగాణల్లో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరాలంటే బిజెపి అధికారంలోకి రావాలన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రల్లో నీటి సమస్యలు తీరుస్తామని చెప్పారు. బిజెపికి సీమాంధ్ర తరపున ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా సీమాంధ్ర హక్కుల కోసం పోరాడిందని చెప్పారు. బిజెపిలో సమర్థనాయకత్వం ఉందన్నారు.
కాంగ్రెసు హఠావో దేశ్ బచావో అనే నినాదం అందరు అందుకున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇదే నినాదాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. సీమాంధ్రకు ప్రస్తుతం రాజధాని, నీటి సమస్యలు ఉన్నాయన్నారు. బిజెపితో కలిసి నడిచేందుకు చాలా పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తమతో కలిసి వచ్చే పార్టీలతో తాము కలిసి నడుస్తామన్నారు.