జగన్ పార్టీలోకి వెళ్లను, పరిస్థితి వస్తే తప్పకుంటా: పురంధేశ్వరి, మీడియాపై ఘాటుగా...
తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను పురంధేశ్వరి ఖండించారు. పనిలో పనిగా సోషల్ మీడియాపై ఆమె విమర్శలు చేశారు.
హైదరాబాద్: తాను వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను బిజెపి నేత, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు.
తన తండ్రి ఎన్టీ రామారావుతో పాటు భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనకు రాజకీయాల్లో విలువలు నేర్పించారని, వాటిని తాను తుచ తప్పకుండా పాటిస్తానని ఆమె అన్నారు. పనిలో పనిగా ఆమె మీడియాపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా బాధ్యతారహితంగా వ్యవహరించడం విషాదకరమని అన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్త తనను వేదనకు గురి చేసిందని అన్నారు. అందరి పట్ల గౌరవంతో, ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశంతో కాకుండా తాను ఓ విషయం స్పష్టం చేయదలుచుకున్నానని, తాను బిజెపిలోనే కొనసాగుతానని పురంధేశ్వరి చెప్పారు.
బిజెపిని వదిలిపెట్టాల్సి వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె అన్నారు. తన తండ్రి, భర్తల మాదిరిగా తాను ప్రజా జీవితంలో తాను విలువలను పాటిస్తానని చెప్పారు. అయితే, ఆమె బెంగళూరులో వైయస్ జగన్ను కలిసినట్లు, ఆ తర్వాత రోజా ఆమెను కలిసినట్లు వార్తలు వచ్చాయి.