ఆ లెక్కలేమిటి: చంద్రబాబుపై విరుచుకుపడ్డ పురంధేశ్వరి
కర్నూలు: పోలవరం వివాదంపై బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆమె శనివారం మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు చేసిన మర్నాడే పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్రప్రభుత్వం తాను తప్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తోందని పురంధేశ్వరి అన్నారు.
పోలవరంపై తప్పుడు లెక్కలు
పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని పురంధేశ్వర విమర్శించారు. సరైన లెక్కలు పంపకుండా కేంద్రంపై నిందలు వేయడం సరికాదని ఆమె అన్నారు.. శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు.
మిత్ర పక్షమో, ప్రతిపక్షమో...
ప్రతిపక్షమా.. మిత్రపక్షమా.. అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందని పురంధేశ్వరి అన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని అనడం సరికాదని అన్నారు.
మిత్రపక్షమై కూడా...
తెలుగుదేశం పార్టీ తమ పార్టీకి మిత్రపక్షమై ఉండి కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని పురంధేశ్వరి అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభత్వం కేంద్రంతో వివరాలు పంచుకోవడం లేదని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి లేదని ఆమె అన్నారు. పైగా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అది సరికాదు..
సరైన వివరాలు ఇవ్వకుండా, లెక్కలు చూపించకుండా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనడం సరి కాదని పురంధేశ్వరి అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ఈఏపీ ప్రాజెక్టు ద్వారా నిధులు ఇస్తోందని పురందరేశ్వరి తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.